Crime News: వైద్యులు లేకపోవడంతో డెలివరీ చేసిన నర్సులు.. బిడ్డతో సహా తల్లి మృతి!

Crime News: ప్రభుత్వ కొలువులలో ఉండి వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ సరైన విధులు నిర్వర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సరైన సమయంలో వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తుముకూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

మధుగిరి తాలూకా బ్రహ్మదేవరహళ్లికి చెందిన కమలమ్మ(28) కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కమలను కారులో హొసకెరె పీహెచ్‌సీకి తరలించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో కమలమ్మకు నర్సులు డెలివరీ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చేత నర్సులు తన ప్రాణాలను కాపాడ లేకపోయారు.

దీంతో డెలివరీ సమయంలో బిడ్డతో పాటు తల్లి కూడా మృతిచెందడంతో కమలమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వ కొలువులో ఉండి ఉద్యోగాలకు గైహాజరవుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి వైద్యులు ఆస్పత్రిలో ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని కమలమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.