పెళ్లి వార్తలపై నిత్యా మీనన్‌ ఏమంటుందో తెలుసా?

Nithya Menon

ఈ మధ్య తరచుగా నటి నిత్యా మీనన్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, మాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌తో ఆమె ఏడడుగులు వేయబోతుందంటూ పలు మలయాళ వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ చానల్లో వస్తున్న కథనాలు హాట్ హాట్ గా సోషల్ మెడియలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఈ బ్యూటీ ఆ వార్తలను లైట్ గానే తీసుకుంది. పట్టించుకుంటే మరింత ఎక్కువగా వైరల్ అవుతాయని భావించిందేమో.. అయితే.. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ పెళ్లి ప్రశ్నే గుప్పుమంది. దీనితో ఇక లాభం లేదనుకున్న నిత్యా మీనన్‌ తన పెళ్లి వార్తలపై ఘాటుగానే స్పందించింది. ఇవన్నీ వట్టి పుకార్లేనని, వీటిలో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది.

మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో దీనిపై నిత్యా స్పందిస్తూ.. ‘చాలాకాలంగా నా పెళ్లి అంటూ తెగ వార్తలు పుట్టుకు వస్తున్నాయి. అసలు అందులో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదని’ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టానని,ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. ప్రస్తుతం నిత్యా మీనన్‌ వెబ్‌ సిరీస్‌, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇటీవల భీమ్లా నాయక్‌తో అలరించిన ఆమె తాజాగా మోడ్రన్ లవ్ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ అవుతోంది. వీటితో పాటు తాజాగా ఆమె నటించి మలయాళ చిత్రం 19(1)(a) డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే దీని రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంలో హీరో ధనుష్‌తో నటించిన ‘చిరు చిత్రంబళం’ త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఆమె మరో చిత్రం ‘ఆరం తిరుకల్పన’ ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.