Telangana: పెళ్లయిన రెండు వారాలకి శవమై కనిపించిన నవవరుడు.. ఏం జరిగిందంటే?

Telangana: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెళ్లైన రెండు వారాలకే విగతజీవిగా పడి ఉండడంతో గ్రామంలో పెద్ద ఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు పెళ్లి తర్వాత రెండు వారాలకు కనిపించకుండా పోయి చివరికి విగతజీవిగా కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి కొత్త నరేష్ వివాహం జరిగి రెండు వారాలు మాత్రమే అయింది. ఈ క్రమంలోనే నరేష్ కనిపించకుండా అదృశ్యమయ్యారు.ఈ క్రమంలోనే అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన కుటుంబ సభ్యులకు మంగళకుంట గ్రామం చెరువు వద్ద నరేష్ మృతదేహం లభ్యమైంది.

మంగళ కుంట గ్రామం చెరువు వద్ద నరేష్ ద్విచక్రవాహనం, చెప్పులను గుర్తించిన కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లు సహాయంతో నరేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఇతనికి డిసెంబర్ 26వ తేదీ కోకాపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.