Crime News: ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి పరిధిలో దారుణం.. యువకుడి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన స్నేహితులు..!

Crime News: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు కలిసి మరొక స్నేహితుడి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. 90 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు 25 సంవత్సరాల ఆదిల్, అదే వయసు గల ఆజర్, 30 సంవత్సరాల వయసు గల మొహమ్మద్ అనే ముగ్గురు మిత్రులు. వీరు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి మైదానంలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏదో విషయం మీద గొడవ పడిన వీరు అకస్మాత్తుగా మొహమ్మద్, ఆజర్ ఇద్దరు కలిసి ఆదిల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు.

శరీరానికి నిప్పు అంటుకోవడంతో బాధితుడు ఆదిల్ గట్టి గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు, ఆస్పత్రి సిబ్బంది మంటలను ఆర్పివేశారు, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.

అయితే హత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరి మీద గతంలో నేర చరిత్ర ఉందని, గతంలో కొన్ని దొంగతనాల లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.