నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి ఫిక్స్ … ఎవరంటే ?

Yesu Babu’ slogan starts BJP Tirupati

తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. రేపే నామినేషన్‌ దాఖలు చేసేందుకు చివరి తేది. దీంతో ఇవాళ ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ వరుసగా తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అధిష్టానం. దీంతో రేపు నివేదిత రెడ్డి తన నామినేషన్‌ వేయనున్నారు. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

దీంతో టీఆర్ఎస్ అధిష్టానం…అక్కడ నోముల కుమారుడు.. భగత్ కుమార్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ను కలిసిన భగత్.. బీఫారమ్ కూడా అందుకున్నారు. రేపు భగత్ కూడా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. చేపట్టనున్నారు అధికారులు. వచ్చేనెల అంటే ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది.