Crime News: దారుణం…కూతురిని పోషించలేక అమ్ముకున్న తల్లి తండ్రులు..!

Crime News: ఆడపిల్ల పుడితే తమకు భారంగా భావించే తల్లిదండ్రులు ఈ కాలంలో కూడా ఉన్నారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు.. కానీ అటువంటి ఆడపిల్ల పుడితే మాత్రం వారిని పోషించలేక ఏ చెత్తకుప్పలోనో పడేసి వారి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి కలకలం రేపుతోంది.జాజ్‌పూర్‌ జిల్లాలోని ధర్మశాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సనొరాయిపొడా గ్రామానికి చెందిన నటవర బెహరా , అతని భార్య కాంచన్‌ బెహరా దంపతులకు ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈనెల 27వ తేదీన నటవర బెహరా భార్య కాంచన్ బెహరా ధర్మశాల ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

28వ తేదీ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. అదే రోజున నటవర బెహరా తన నాలుగవ కుమార్తెను మహాకలపడా ప్రాంతానికి చెందిన దంపతులకు 12 వేల రూపాయలకు అంగన్వాడి కార్యకర్త సహకారంతో అమ్మేశాడు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు రంగంలోకి దిగి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపి శనివారం రాత్రి దత్తత తీసుకున్న వారి దగ్గర నుండి పాపను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేసి ఆదివారం ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. శిశువు తల్లిదండ్రులను పోలీసులు విచారించగా.. రోజు కూలి పనులు చేసుకుని బ్రతకటం వల్ల ఆర్థిక ఇబ్బందులతో శిశువు పోషణ భారమై పసిబిడ్డను అమ్మినట్లు వారు చెప్పుకొచ్చారు. తల్లిదండ్రుల అభ్యర్థన వల్ల అంగన్వాడీ కార్యకర్త దత్తత తీసుకునే వారిని సంప్రదించిందని ఆ దంపతులు వెల్లడించారు.