ప్రభాస్ ఫ్యామిలీ ని ఆత్మీయంగా స్వాగతించిన మొగల్తూరు స్థానికులు, అభిమానులు

ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం ఇవాళ కృష్ణంరాజు స్వస్థలమైన  మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం చెప్పారు. తాము ఎంతగానో అభిమానించే కృష్ణంరాజు భౌతికంగా దూరమవడం అక్కడి వారిలో ఉద్వేగాన్ని నింపింది.

స్మారక కార్యక్రమానికి భారీ ఎత్తున స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. వచ్చిన వారిని పలకరించి, అభివాదాలు తెలిపారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా తినేందుకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరినీ లంచ్ తిని వెళ్లమని కోరారు.  ఈ కార్యక్రమం ఆసాంతం ఉద్వేగపూరితంగా సాగింది.