Crime News: చెన్నైలో పురివిప్పిన పాత కక్షలు… ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్..!

Crime News: ఈ రోజుల్లో కూడా పాత కక్షలతో చాలామంది హత్యలకు పాల్పడుతున్నారు. పాత కక్షల వల్ల ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. వివరాలలోకి వెళితే.. విల్లివాక్కాయంలోని అగతీశ్వర్ కోయిల్ స్ట్రీట్‌కు చెందిన రంజిత్ అలియాస్ ‘డబుల్’ రంజిత్ అనే రౌడీ షీటర్ ఒక హత్య కేసులో అరెస్టయి ఇటీవల బెయిల్ మీద జైలు నుండి బయటకి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు రంజిత్ కోసం ప్లాన్ ప్రకారం మాటువేసి హత్య చేయడానికి ప్రయత్నించారు.

ప్రత్యర్థుల భయంతో రంజిత్ తన స్థావరాన్ని రెడ్ హిల్స్ కు మార్చాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం రంజిత్, అతని అనుచరులు బైక్ మీద వెళ్తుండగా.. రంజిత్ కోసం మాటు వేసిన ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు.వారు దాడి చేయడంతో రంజిత్ అనుచరులు కూడా ఎదురుదాడికి దిగడంతో కొద్దిసేపు అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ గొడవలో రంజిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని అనుచరులు ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు . ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. గాయపడిన అతని అనుచరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకొని అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా కేసును దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి కార్తీక్ , ఉదయకుమార్, జయకాంతన్, , శ్రీనివాసన్‌ తో సహా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.