ఈమధ్య కృష్ణవంశీ నుండి కొత్త సినిమా ప్రకటన ఒకటి వచ్చింది. అదే ‘అన్నం’. విస్తరాకులో రక్తంతో తడిసిన అన్నం, కత్తి, తాళిబొట్టు, పరబ్రహ్మ స్వరూపం అనే ఉపశీర్షిక. టైటిల్ పోస్టర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. కృష్ణవంశీ ‘సింధూరం’ లెవల్లో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇందులో స్టార్ హీరో నటిస్తారని తెలుస్తోంది. నిజానికి ఇది నందమూరి బాలకృష్ణ చేయాల్సిన కథ. ఒకప్పుడు కృష్ణవంశీ ‘రైతు’ పేరుతో బాలయ్య కోసం స్క్రిప్ట్ రాసుకున్నారు. బాలయ్యతో చర్చలు కూడ జరిపారు.
కానీ అది వర్కవుట్ కాలేదు. సినిమాలో ఒక కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ చేత చేయించాలని అనుకున్నారు బాలయ్య, కృష్ణవంశీ. అమితాబ్ వద్దకు వెళ్లడం, కథ చెప్పడం జరిగింది. కానీ ఆయన కథ నచ్చక ఒప్పుకోలేదు. ఆ పాత్ర అమితాబ్ చేస్తేనే సినిమాకు అందం ఉంటుందని భావించిన బాలయ్య ప్రాజెక్టును పక్కనపెట్టేశారు. ఇన్నాళ్లు ఎదురుచూసిన కృష్ణవంశీ ఇక ఆగలేక ఆ కథకే కొన్ని మార్పులు చేర్పులు చేసి ‘అన్నం’గా మార్చారట. ఇప్పుడు పెద్ద హీరోనే ఈ సినిమా చేస్తారని అంటున్నారు. మరి బాలయ్య చేయాల్సిన ఈ కథ ఏ హీరో వద్దకు వెళుతుందో చూడాలి.