నారా లోకేష్‌పై విరుచుకుపడ్డ కొడాలి నాని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విరుచుకుపడ్డారు నారా లోకేష్.. అదీ అత్యంత తీవ్రస్థాయి విమర్శలతో. అందునా, వైఎస్ జగన్ కుమార్తెల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని తనదైన స్టయిల్లో స్పందించారు. చంద్రబాబుపైనా, నారా లోకేష్ పైనా.. తిట్ల వర్షం కురిపించేశారు. వాడు, వీడు, వెధవ.. ఇలా ఒకటేమిటి, అడ్డగోలు రకాలుగా కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ని విమర్శించే స్థాయి నీకెక్కడిది.? అని లోకేష్‌ని ప్రశ్నించారు కొడాలి నాని. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు లాంటోళ్ళు స్వేచ్ఛగా గన్ మెన్లను వెంటేసుకుని రోడ్ల మీద తిరుగుతుండడం వల్లే.. సమాజంలో చెడు ప్రవర్తనలకు కొందరు ఆకర్షితులవుతున్నారనీ, గుంటూరులో రమ్య హంతకుడు కూడా చంద్రబాబు లాంటోడేనని కొడాలి నాని వ్యాఖ్యానించడం గమనార్హం.

రమ్య హంతకుల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదనీ, ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకే దిశ చట్టం, దిశ యాప్ తీసుకొచ్చామని అన్నారు కొడాలి నాని. కాగా, హోం మంత్రి మేకతోటి సుచరిత సహా పలువురు వైసీపీ నేతలు, నిన్న నారా లోకేష్ సహా టీడీపీ నేతలు చేసిన హడావిడిపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుందనీ, ఆదుకుంటుందనీ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై విపక్షాలు రాజకీయం చేయడం సహజమే. అయితే, అధికార పక్షానిదే పూర్తి బాధ్యత.. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవడంలో. ప్రతిపక్షంపై విమర్శలతో సరిపెడితే, రాజకీయంగా అది తమకు అడ్వాంటేజ్ అవుతుందనుకుంటే.. వైసీపీ తప్పులో కాలేసినట్లే అవుతుంది.