కేసీఆర్ సరికొత్త రాజకీయ ఎత్తుగడ.. పాపం పీవీ కూతురు..!

cm kcr

 రాజకీయంలో ఎత్తులకు పైఎత్తులు వేయటంలో కేసీఆర్ కు అపారమైన అనుభవం ఉందన్న విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. తాజాగా తెలంగాణ లో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చూస్తే, ఆయన సత్తా ఏమిటో మరోసారి తెలుస్తుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవీని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం… పోటీకి ఆమె అంగీకరించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. సురభి వాణిదేవి… రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు.

surabhi vanidevi

 అలాంటి ఆమెను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దించటం ఒక గట్టి ఎత్తుగడ అనే చెప్పాలి. ఎందుకంటే నిజానికి హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం తెరాస కు అనుకూలమైనది కాదు. గతంలో ఉద్యమ వేడి ఉన్నప్పుడే… ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ను ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఓడిపోయారు. దీనితో అక్కడ పోటీచేయడానికి తెరాస నేతలు ఎవరు సాహసించలేదు. ఒక వేళా వాళ్ళను పోటీకి దించిన ఓటమి ఖాయం.

 ఇలాంటి స్థితిలో పీవీ కూతురును దించటం వలన ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పిఎమ్ గా పని చేసిన నాయకుడి కుమార్తె. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకునపడుతుంది.ఇక భాజపా సంగతి కూడా అలాగే వుంటుంది. భాజపా అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణి కి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ వుంటుంది. అలాగే పివి అంటే వర్గాలు, పార్టీలకు అతీతంగా అభిమానించేవారు వున్నారు. పట్టణ ఓటర్లు, యువతలో కూడా పివి అంటే అభిమానించేవారు ఇప్పటికీ వున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కొంచం డైలమాలో పడే అవకాశం ఉంది.

 నిజానికి కేసీఆర్ కొంత కాలంగా పీవీ కుటుంబానికి మంచి గౌరవం ఇస్తున్నాడు. పీవీకి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓ వర్గాన్ని అమితంగా ఆకట్టుకోవచ్చన్నలక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆమె కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. గత ఆగస్టులో గవర్నర్ కోటాలో మూడు స్థానాలు భర్తీ చేశారు. అప్పట్లోనే పీవీ కుమార్తె పేరును టీఆర్ఎస్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగాపోటీకి నిలబెట్టారు. ఇది పీవీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేస్తోంది.