తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలోలా ముందస్తు ఎన్నికలకు వెళతారా.? అంటే, ఔననీ చెప్పలేం.. కాదనీ చెప్పలేం.. అన్నట్టు జరుగుతోంది చర్చ. మీడియా, రాజకీయ వర్గాల్లో ఇదే విషయమై చాలాకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీయార్ మనసులో ఏముందో ఊహించడం ఎవరికైనా అంత తేలిక కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఈ విషయమై ఎవరికీ స్పష్టత లేదు. గులాబీ నేతలు, ‘మేమెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాం.?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.. అదే సమయంలో, ‘కేసీయార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుంటాం..’ అని చెబుతున్నారు.
గతంలో.. అంటే, 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అదీ ముందస్తుగా. 2019లో జరగాల్సిన ఎన్నికలు కాస్తా, 2018 చివర్లో జరగడానికి కేసీయార్ వ్యూహమే కారణం. ఆ వ్యూహం ఫలించింది.. తిరిగి అధికారంలోకి వచ్చారు కేసీయార్. ఈసారి కూడా అదే వ్యూహాన్ని కేసీయార్ అమలు చేయబోతున్నారన్న ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.
కొన్నాళ్ళ క్రితం పార్టీ ముఖ్య నేతలతో ముందస్తుపై సమాలోచనలు జరిపిన కేసీయార్, ఆ తర్వాత ముందస్తు ఊసుని పక్కన పడేశారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనతో ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అన్నట్టు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.. పలువురు జాతీయ నేతల్ని కలుస్తున్నారు.
అయితే, జాతీయ స్థాయిలో కేసీయార్ ఆలోచనలు, వాటి ద్వారా వచ్చే సానుకూల సంకేతాలకు అనుగుణంగానే కేసీయార్ ముందస్తు ఎన్నికల ఆలోచన తెలంగాణలో చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. జూన్ నెలాఖరు నాటికి కేసీయార్, ముందస్తు ఎన్నికలపై స్పష్టతకు వస్తారన్నది తాజా ఖబర్.
వాస్తవానికి 2023 చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. వచ్చే ఏడాది మార్చిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ ముందస్తు ఎన్నికలు జరిగేలా కేసీయార్, జగన్ సమాలోచనలు చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న ఓ అంచనా. చూద్దాం.. ఏం జరగబోతోందో.!
