Crime News:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువతి పై అత్యాచారం చేసి ఆపై హత్య!

Crime News: ప్రస్తుత కాలంలో దేశంలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. పోలీసులు శత విధాలుగా ప్రయత్నించి ఎన్ని కఠిన చర్యలు అమలు చేసిన క్రైమ్ కేసులు సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రతిరోజు ఎంతోమంది అత్యాచారానికి ,హత్యలకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. రాత్రి సమయంలో బయటికి వెళ్ళిన యువతి ఉదయాన్నే మామిడి తోటలో చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

వివరాలలోకి వెళితే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలో యువతిపై అత్యాచారం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హుగ్గెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న మౌనిక(17) అనే యువతి జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల యువతి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రాత్రిపూట ఒంటరిగా ఇంటి నుండి బయటికి వెళ్ళింది. అలా తల్లికి చెప్పకుండా రాత్రిపూట బయటకి వెళ్లిన మౌనిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి కంగారు పడింది. ఉదయం మామిడి తోటలో పని నిమిత్తం వెళ్ళిన కూలీలు మౌనిక విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ ఉండటం చూసిన వెంటనే ఈ సమాచారాన్ని గ్రామ సర్పంచ్ కు తెలియజేశారు.

హుగ్గెల్లి గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి తర్వాత ఆమెను చున్నితో ఉరి వేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. మౌనిక కు బాగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలంలో లభ్యమైన సెల్ఫోన్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు వివరించారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.