Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. భర్త పెట్టే బాధలు భరించలేక దారుణానికి పాల్పడిన భార్య…!

Crime News: ఆధునిక కాలంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన అనేకమంది మద్యపానం, ధూమపానం వంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు. ఫలితంగా మద్యం మత్తులో అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. చాలామంది మద్యం మత్తులోఉండి ఇంట్లో ఉన్న భార్య, పిల్లలను హింసిస్తుంటారు. ఇలా భార్య ను హింసిస్తున్న భర్త ఆగడాలను తట్టుకోలేకపోయిన భార్య, అతని మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హతమార్చింది. ఈ అమానవీయమైన ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన కిట్టిపాటి మోహనకృష్ణ రెడ్డి (31), సంతనూతలపాడు కి చెందిన రుక్మిణి పది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లి అయినప్పటి నుండి వీరు సంతనూతలపాడు లోనే నివసిస్తున్నారు. పెళ్లి అయిన కొత్తలో వీరి దాంపత్య జీవితం అన్యోన్యం గానే సాగింది.

ఈ నేపథ్యంలో మోహనకృష్ణ రెడ్డి మద్యానికి బానిసై, ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యని చిత్రహింసలు పెట్టేవాడు. ఈ మధ్యకాలంలో రుక్మిణిని మాత్రమే కాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా వేదించసాగాడు. భర్త అకృత్యాలకు విసుగు చెందిన భార్య అతన్ని అడ్డు తొలగించుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోమవారం బాగా మద్యం తాగి వచ్చి ఇంట్లో మద్యం మత్తులో గాఢనిద్రలో ఉన్న భర్త మోహనకృష్ణ రెడ్డి పైన పెట్రోల్ పోసి నిప్పంటించింది. మోహనకృష్ణ రెడ్డి కేకలు వేస్తూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రుక్మిణిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.