Crime News: నెల్లూరు జిల్లాలో దారుణం.. మహిళా దినోత్సవం రోజే విదేశీయువతిపై అత్యాచారయత్నం..!

Crime News:నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన సంభవించింది. మహిళా దినోత్సవం నాడు ఇద్దరు యువకులు విదేశీ యువతి పై అత్యాచార యత్నం చేశారు. యువతి చాకచక్యంగా వ్యవహరించడంతో దేశ పరువు నిలబడింది. సంఘటన జరిగిన గంటలోపే నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా దినోత్సవం నాడే దేశ ప్రతిష్టను నాశనం చేసే పని చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లిథువేనియాకు చెందిన 26 ఏళ్ల యువతి భారతదేశ పర్యటనకు వచ్చింది. సోమవారం ఉదయం శ్రీలంక నుండి చెన్నై విమానాశ్రయం చేరుకుంది. అక్కడి నుండి గోవా వెళ్లేందుకు ఆమె చెన్నై నుండి బెంగళూరుకు బస్సులో బయలుదేరింది. ఆమె వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుండి దింపేసాడు. అదే బస్సులో ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బును ఆమెకు ఇచ్చి సహాయం చేసాడు. తర్వాత మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన కొన్ని సందర్శనా స్థలాలు చూపిస్తాను అని నమ్మబలికాడు.

ఆమెను తనతో పాటు బద్దెవోలు వెంకన్నపాలెం గ్రామానికి తీసుకొచ్చాడు. గూడూరు రూరల్ పరిధిలోని శారద నగర్ కు చెందిన తన స్నేహితుడు షేక్ అబీద్ తో కలిసి ఆమెపై అత్యాచారానికి కుట్రపన్నాడు. మంగళవారం నాడు ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపిస్తానని అబీద్ తో కలిసి బైక్ పై తీసుకువెళ్ళాడు. విదేశీ యువతి ని సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం, వారి చేష్టలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ యువతి చాకచక్యంగా వారి నుండి తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా నిల్చున్న యువతిని చూసి స్థానికులు ఆమెను సైదాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ విజయరామారావు ఆదేశాలతో డిఎస్పి రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ శ్రీనివాసులు రెడ్డి, సైదాపురం, గూడూర్ రూరల్, మనుబోలు ఎస్సైలు టీములుగా మారి నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నారు.