Crime News: కేరళలో దారుణం… కన్న వారిని నరికి చంపిన కసాయి కొడుకు..!

Crime News: వయసు మీరిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కన్నకొడుకే కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను అతి కిరాతకంగా నడిరోడ్డుపై నరికి చంపాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కుట్టన్ (60), చంద్రిక (55) దంపతులు కేరళలోని త్రిస్సూర్ జిల్లా లోని ఇంచకుండు గ్రామం లో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకి వివాహం జరిగింది, ఆమె అత్తగారింట్లో ఉంటుంది. కుమారుడు అనీష్ (30) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల ప్రాంతంలో బయట నుండి బైక్ మీద వచ్చిన అనీష్, ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న తల్లిదండ్రుల మీద ఒక్క సారిగా కొడవలితో దాడి చేశాడు. మొదటగా తండ్రి మీద దాడి చేసి తర్వాత తల్లి మీద దాడి చేసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్టు పోలీసులకు చెప్పి అక్కడి నుండి బైక్ మీద పారిపోయాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన కారణాల గురించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం తల్లిదండ్రులు, కొడుకు మధ్య తరచు చిన్న చిన్న గొడవలు జరిగేవని తెలిపారు.