Road Accident:తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. కళ్ళెదుటే తన ప్రతిరూపాన్ని కోల్పోయిన తల్లి..!

Road Accident: ఈ మధ్యకాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతోంది ఉన్నాయి. వాహనాన్ని నడిపే వారు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వాహనదారులు అతి వేగంగా వాహనాలను నడపటం వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు అమలు చేసినప్పటికీ.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న తోట సుమన్ అనే వ్యక్తి తన డ్యూటీ లో భాగంగా మూడు రోజులపాటు అంతర్వేదిలో ఉండవలసి రావటంతో తన భార్యా పిల్లలను పుట్టింటికి వెళ్ళమన్నాడు . సుమన్ అత్త దుర్గ భవాని తన కూతురిని మనవరాలిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళటానికి పత్తిపాడు వచ్చింది. ముగ్గురూ కలిసి ద్విచక్రవాహనంపై వేమగిరి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో రాజానగరం వద్ద వెనక నుండి అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న టూ వీలర్ నీ ఢీ కొట్టి ఆపకుండా వెళ్ళిపోయింది.

దుర్గ భవాని ఆమె కూతురు ఒకవైపు పడగా చిన్న గాయాలతో బయట పడ్డారు. కానీ చిన్నారి మాత్రం వ్యాన్ చక్రాలు ఆమె మీద నుండి పోవటంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్న కూతురు తమ కళ్ల ఎదుటే ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి ఎంతగానో రోదించింది. ఆమె బాధను చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.