Crime News: పిల్లలు పుట్టలేదని భార్యని కిరాతకంగా చంపిన భర్త…!

Crime News: ఈ మధ్యకాలంలో అనేకమంది సంతాన లేమి తో బాధపడుతున్నారు. టెన్షన్లు, మారిన ఆహారపు అలవాట్లు, దాంపత్య జీవితంలో సమస్యల వల్ల పిల్లలు ఆలస్యంగా పుట్టడం లేదా పుట్టకపోవడం వంటి సమస్యలు అధికం అయ్యాయి. తద్వారా దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోయి, గొడవలకు దారి తీస్తోంది. కొన్ని సందర్భాలలో కట్టుకున్న భర్త కాలయముడు అవుతున్నాడు. ఇటువంటి సంఘటన కర్ణాటక లోని బళ్ళారి లో సంభవించింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు….. వీరేష్, సునంద దంపతులు బీజాపూర్ జిల్లా ఇండి తాలూకా కేరవార గ్రామానికి చెందిన వారు. వీరు బళ్ళారి నగరం లోని శాస్త్రి నగర్ రెండవ క్రాస్ లో నివాసం ఉంటున్నారు. వీరేష్ ఆర్టీసీ లో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్ళై 15 సంవత్సరాలు అయ్యింది, ఎంతకూ పిల్లలు పుట్టక పోవడం తో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెరిగి పెద్దవి అయ్యి తరచూ గొడవ పడేవారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడు అయిన భర్త, క్షణికావేశంలో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. శనివారం ఉదయం ఎంత సేపటికి సునంద బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. కౌల్ బజార్ సి ఐ సుభాష్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాసు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.