HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమాని తిరిగి జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. నిర్మాత ఎ.ఏం. రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేసామని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిజమైన చార్మినార్ దగ్గరే సన్నివేశాలను షూట్ చేయవచ్చు కానీ మేము అనుకున్న విధంగా సినిమా రావాలి అంటే తప్పనిసరిగా చార్మినార్ సెట్ అయితే బాగుంటుందని నిజమైన చార్మినార్ ఎంత హైట్ ఉందో అదే విధంగా చార్మినార్ సెట్ వేసామని తెలిపారు.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రను ఎంజీఆర్, ఎన్టీఆర్లను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించామని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలియజేశారు.ఎందుకంటే తాను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు పవన్కల్యాణ్ను ప్రజలు హీరోగా కంటే కూడా నాయకుడిగా చూడటం మొదలు పెట్టారని తెలిపారు. అందుకు తగినట్లుగానే కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇక ఇందులో వీరమల్లు వాడే ఆయుధాలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు అయితే రెండో భాగం కూడా ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ వెల్లడించారు.
