`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చిత్ర లోగోను ఆవిష్కరించిన ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్‌

nag ashwin : జాతీయ‌స్థాయిలో ప‌లు అవార్దులు పొంది తెలుగులో గ‌ర్వించే సంస్థగా పేరుపొందిన‌ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారి శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్ర లోగోను సోమ‌వారంనాడు ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ శిష్యులు వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ ద‌ర్శకులుగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ: ఏడిద నాగేశ్వర‌రావుగారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ది గొప్ప గ్రేట్ జర్నీ. అలాంటి గొప్ప సంస్థ మళ్ళీ మొదలవ్వడం చాలా ఆనందంగా వుంది. శంకరాభరణం, స్వాతిముత్యం.. ఇలా చాలా క్లాసిక్ మూవీలు వారి సంస్థ నుంచి వ‌చ్చాయి. ఆ సినిమాల‌న్నీ చూశాను. వారి సినిమాల్లో ‘ఆప‌ద్భాంథ‌వు’డు సినిమా చాలా ఇష్టం. నేను చ‌దువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడ‌లేద‌ని చాలా కోపం వ‌చ్చింది. ఎందుకు ఆడ‌లేదో ఆర్థంకాలేదు. ఈ జ‌ర్నీలో వారి వార‌సులు నిర్మిస్తున్న సినిమాకు ప్రమోష‌న్‌కు హెల్ప్ అవ‌డం సంతోషంగా వుంది. ఇంత పెద్ద సంస్థలో అవ‌కాశం వుంటే త‌ప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇప్పుడు శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మంచి సినిమాలు రావాలి. అనుదీప్ క‌థ‌, స్క్రీన్క్‌ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫ‌న్ వుంటుంది. జాతిర‌త్నాలు హిట్ త‌ర్వాత త‌న స్వార్థం చూసుకోకుండా త‌న తోటివారిని ఎంక‌రేజ్ చేయ‌డం నాకు గ‌ర్వంగా వుంది. ద‌ర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్‌. చ‌దివాడు. సినిమాపై త‌న‌ప‌లో ఈ రంగంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు అనుదీప్ వ‌ల్ల ద‌ర్శకుడు అయ్యాడు. జాతిర‌త్నాలకు ముందు వంశీ ఒక షార్ట్ ఫిలిం తెచ్చాడు. కానీ అది చాలా లాంగ్ ఫిలింలా అనిపించింది. త‌ను కాలేజీలో ప‌లు స్క్రిట్‌లు వేసేవాడు. జాతిర‌త్నాలకు క‌రెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. త‌న‌లో చాలా క్రియేటివిటీ వుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` పోస్టర్ ఒక్కటే చేశాను. వంశీది చాలా యునిక్ జోన్ అఫ్ కామెడీ. కథ గురించి చిన్న లైన్ చెప్పాడు. దానికే రెండు నిమిషాలు నవ్వుకున్నా. సినిమా ఎలా వుంటుందో అనే ఎక్సయిట్మెంట్ వుంది. జాతిరత్నాలు కంటే పెద్ద హిట్ కావాలి” అని కోరుకున్నారు.

జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ మాట్లాడుతూ, జాతిర‌త్నాల‌కు వంశీ ప‌నిచేశాడు. ఎం.బి.బి.ఎస్‌. చ‌దివినా ఆస‌క్తితో ద‌ర్శక‌త్వం శాఖ‌లో చేరాడు.

ఓసారి ఏదైనా క‌థ వుందా అని అడిగాడు. అప్పుడే క‌థ రాశాను. శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో వ‌స్తున్న ఈ సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుంది. ర‌థ‌న్ మంచి సంగీతం స‌మ‌కూర్చారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టైటిల్ గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లో తెలియ‌జేస్తాను అన్నారు.

ఏడిద శ్రీ‌రామ్ మాట్లాడుతూ, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నుంచి మంచి సినిమాలు వ‌చ్చాయి. అలా మంచి సినిమాలు చేయాల‌ని నా కుమార్తె శ్రీ‌జ ఎనిమిది సంవ‌త్సరాలుగా అంటుండేది. మా ఫ్యామిలీ వెల్ విష‌ర్ అల్లు అర‌వింద్‌గారిని క‌లిశాం. యూత్ రావాల‌ని ప్రోత్సహించారు.

ఏక్తాక‌పూర్‌, స్వప్నాద‌త్ పేర్లు ప్రస్తావించారు. ఈ రంగంలోకి రావాలంటే చాలా క‌ష్టప‌డాలి అన్నారు. అందుకు సిద్ధమ‌ని శ్రీ‌జ తెలిపింది. ఆ త‌ర్వాత స్వప్నా ద‌త్‌ను క‌ల‌వ‌డం జ‌రిగింది. అప్పుడు ఆమె వెబ్ సిరీస్ చేస్తున్నారు. దానికి ప‌రిశీల‌న‌గా శ్రీ‌జ చేశారు. ఆ త‌ర్వాత అందులో ఒక సీన్‌ను శ్రీ‌జ హ్యాండిల్ చేసింది. జాతిర‌త్నాలు సినిమా మాకు బాగా న‌చ్చింది. అస‌భ్యత‌కు తావులేని సినిమా అనుదీప్ తీశాడు. ఆయ‌న‌కు ఫోన్ చేసి మా బేన‌ర్‌లో సినిమా చేయ‌మ‌ని అడిగాం. త‌ను చాలా బిజీఅయ్యాడు. అందుకు వారి అసిస్టెంట్‌లు వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌ను ద‌ర్శకులుగా ప‌రిచ‌యం చేసేలా అవ‌కాశం క‌ల్పించారు. మ‌హాన‌టి సినిమా చూశాక ఎలాగైనా ఆ ద‌ర్శకుడితో సినిమా చేయాల‌నుకున్నాం అంటూ ఆఫ‌ర్ ఇచ్చారు. ఇక `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ప్రోగ్రెస్ గురించి చెబుతూ, సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అన్నారు.

నిర్మాత శ్రీ‌జ మాట్లాడుతూ, మా తాత‌గారి సినిమాలు చూసి పెరిగాం. అందుకే మంచి సినిమాలు చేయాల‌ని బేన‌ర్ స్థాపించాం. క్లాసిక‌ల్ ట‌చ్ చేయ‌కుండా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ఫ్యామిలీతో హాయిగా న‌వ్వుకునే సినిమాలు చేయాల‌ని నిర్మిస్తున్నాం అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు వంశీ మాట్లాడుతూ, జాతిర‌త్నాలు సినిమాకు అవ‌కాశం ఇచ్చిన నాగ్ అశ్విన్‌, అనుదీప్‌ల‌కు కృత‌జ్తత‌లు తెలియ‌జేశారు. ఈ సినిమా త‌ర్వాత ఈ చిత్ర క‌థ మొద‌లైంది. నాకు అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌రామ్‌, శ్రీ‌జ‌ల‌కు థ్యాంక్స్ అని అన్నారు.

మ‌రో ద‌ర్శకుడు ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ, జాతిర‌త్నాలు టైంలో వంశీ మంచి మిత్రుడ‌య్యాడు. ఈ చిత్ర క‌థ విన్నాక బాగా న‌చ్చింది. మంచి కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డం ఆనందంగా వుంది అన్నారు.