Crime News: కుటుంబ కలహాలతో 6 ఏళ్ల వయసున్న కూతురితో సహా తండ్రి ఆత్మహత్య..!

Crime News: ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు కష్టసుఖాలలో పాలుపంచుకుంటు ఒకరికొకరు తోడుగా ఉండాలి. కానీ ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా విడాకులు తీసుకొని దూరమవుతున్నారు. కొందరు మనస్పర్థల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల యాదాద్రి జిల్లాలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే…హైదరాబాద్‌లోని చందానగర్‌లో చెరుకూరి సురేష్ అనే వ్యక్తి భార్య, కూతురు శ్రేష్ఠతో కలిసి నివసిస్తున్నాడు. సురేష్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సబ్ డివిజినల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం సురేష్ తన భార్య బిడ్డలతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు యాదాద్రి గుట్ట కు వచ్చారు. ఈ క్రమంలో యాదాద్రి లోని మయూరి లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. భార్య నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో సురేష్ తన కూతురి తో సహా హోటల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు హోటల్ సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే వారు ఇద్దరు మృతి చెందారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించగా ఒక సూసైడ్ లెటర్ లభ్యమైంది. భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా సురేష్ తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లు రాశాడు. తను ఒక్కడే చనిపోతే తన భార్య కూతుర్ని సరిగా చూసుకోదనీ తన కూతురిని కూడా తనతో పాటు తీసుకెళ్తున్న అని లెటర్ లో రాశాడు. మృతదేహాలను పోలీస్ పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.