క్వాలిటీ చిత్రాన్ని ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు: ‘దర్జా’ నిర్మాతలు

Darja

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి చెప్పిన ‘దర్జా’ చిత్ర విశేషాలివే..

-ఈ స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి ఇలా అనుకున్నాం. తర్వాత జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. అందరూ ఓకే అనుకున్నాం. అలా అనసూయగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

-అనసూయగారిలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’ సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న గొప్ప నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్‌ విషయానికి వస్తే మాకు అనసూయగారే కనిపించారు. ఫస్ట్ సినిమాకి సంబంధించి వేసిన స్కెచ్‌లో సేమ్ టు సేమ్ ‘పుష్ప’ లుక్కే వచ్చింది. ఈ స్టోరీ విన్నాక.. సుకుమార్‌గారిలాగే నా గురించి ఆలోచించారని అనసూయగారు మాకు థ్యాంక్స్ చెప్పారు. మొత్తం మూడు స్కెచ్‌లు రెడీ చేశాం. అందులో అనసూయగారు ప్రస్తుతం సినిమాలో కనిపించిన స్కెచ్‌ని ఓకే చేశారు.

– ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం. ఒక పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన యువతి.. పెద్ద అయిన తర్వాత ప్రజలకు ఎలా ప్రాబ్లమ్‌గా మారింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం. నిర్మాతలుగా మాకిది మొదటి చిత్రం. కానీ ఇంతకు ముందు కొన్ని చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాం.

– ఫస్ట్ సినిమాగా ఇలాంటి స్టోరీ చేయడానికి కారణం.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాం (నిర్మాతలుగా). రావడమే పెద్ద హీరోలతో సినిమాలు అంటే.. జరిగే పని కాదు. అందుకే ముందు ‘దర్జా’ వంటి చిత్రంతో మేమేంటో తెలియజేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో మా బ్యానర్ పేరు ఇండస్ట్రీకి తెలుస్తుంది. తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తాం.

– సునీల్‌గారు, అనసూయగారు ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ మొదట్లో వారి డేట్స్ కోసం ఇబ్బంది పడ్డాం. కానీ వారు డేట్స్ ఇచ్చిన తర్వాత మాత్రం అంతా సాఫీగానే సాగింది. వారు ఇంతగా సపోర్ట్ చేశారు కాబట్టే.. ‘దర్జా’ ఈ రోజు దర్జాగా రెడీ అయింది.

– ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఏదో ఒక అప్‌డేట్‌తో నిత్యం వార్తలలోనే ఉంది. రెండు మోషన్ పోస్టర్స్ విడుదల చేశాం. ఒకటి కె.ఎల్. నారాయణగారు విడుదల చేస్తే.. రెండోది యాక్షన్ కింగ్ అర్జున్ గారు విడుదల చేశారు. టీజర్ డి. సురేష్ బాబుగారు విడుదల చేశారు. ట్రైలర్ వెంకటేష్‌ బాబుగారు విడుదల చేశారు. నాలుగు సాంగ్స్ విడుదల చేశాం. అల్లు అరవింద్‌గారు, కె. రాఘవేంద్రరావుగారు, మైత్రీ మూవీస్ నవీన్ గారు ఇలా సాంగ్స్ విడుదల చేశారు. దాదాపు ఇంటర్వ్యూలు పెట్టి ప్రమోషన్ చేసినంతగా పెద్ద పెద్ద వాళ్లు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్స్ అన్నింటిలో సినిమాకి సంబంధించిన ప్రోమోలు ప్లే అవుతున్నాయి. అలాగే అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో దాదాపు 15 రోజుల నుండి ప్రోమోలు ప్లే అవుతూనే ఉన్నాయి. 2 మంత్స్ ముందు నుండే ప్రొమోషన్స్ చేస్తూ వస్తున్నాం. అలాగే మీడియాలో కూడా ఉన్నాం. సినిమాకి రావాల్సినంత పబ్లిసిటీ బాగానే వచ్చిందని అనుకుంటున్నాం.

– ఇప్పటి వరకు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 400 స్క్రీన్లు వరకు మాకు వచ్చాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది.

-మొదటి నుండి ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత టీమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాతో కొత్తగా పరిచయం అవుతున్న వారందరికీ ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. అంత బాగా వారు యాక్ట్ చేశారు.

– ముందు చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాని చేయాలని అనుకున్నాం. సునీల్‌గారు, అనసూయగారు యాడ్ అయిన తర్వాత.. అవుట్‌ఫుట్ అద్భుతంగా వస్తుండటంతో.. ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాం. ముందు రెండు ఫైట్స్ అనుకుంటే.. తర్వాత నాలుగు, 8 రోజుల షూటింగ్ అనుకున్నది 18 రోజులు ఇలా, రామోజీ ఫిల్మ్ సిటీ, అవుట్ డోర్ షూటింగ్స్.. అన్నింటికీ భారీగానే ఖర్చు చేశాం. క్వాలిటీ, అవుట్‌పుట్ చూసిన తర్వాత.. బడ్జెట్ విషయంలో వెనుకాడలేదు. అందులోనూ ఇది మా మొదటి చిత్రం. నిర్మాణం పరంగా మంచి క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు.

– సెన్సార్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ విన్నాం. అనసూయగారిని పెట్టి ఇంత వయలెన్స్ సినిమా తీశారేంటి? అని, అంత యాక్షన్ ఉన్నా.. సెంటిమెంట్‌ని చక్కగా పండించారు అని.. సెన్సార్ సభ్యులు చెప్పినట్లే.. సినిమా చూసిన మా శ్రేయోభిలాషులు కూడా.. ఒక్క యాక్షన్‌నే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. మంచి సెంటిమెంట్ ఉంది కదా ఇందులో.. అది కూడా ఎగ్జిక్యూట్ చేయవచ్చు కదా.. అని అన్నారు. వారి సలహాల మేరకే ఆమనిగారు, ఇతర టీమ్ ఉన్న పోస్టర్‌ని విడుదల చేశాం. యాక్షన్‌తో నిండిన సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. కామెడీ, డ్యాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. మేము ‘దర్జా’ సినిమా తీశాం. ప్రేక్షకులు ‘దర్జా’గా థియేటర్లకి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం.

– మా బ్యానర్‌లో ముందు ముందు ఫ్యామిలీ అండ్ యాక్షన్ అలాగే అడ్వెంచర్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాం. తర్వాత ప్రాజెక్ట్ కూడా ఫ్యామిలీ అండ్ యాక్షన్ చిత్రమే ఉంటుంది.

– సునీల్‌గారికి, అనసూయగారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ నిజంగా మాకు ఎంతో బలాన్నిచ్చింది. అలాగే సలీమ్ మాలిక్, ర్యాప్ రాక్ షకీల్, కెమెరామెన్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని పొందాము.

– ఈ సందర్భంగా మీడియా వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే డే 1 నుండి ఓ పెద్ద చిత్రానికి సపోర్ట్ చేసినట్లుగా మీడియా మాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. త్వరలోనే మా తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాం.