ఆదిపురుష్ నుండి క్రేజీ అప్‌డేట్… లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర బృందం

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ చిత్రం ఒక‌టి. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించ‌నున్న ఈ చిత్రం రామాయ‌ణం ఇతిహాసం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. భారీ బ‌డ్జెట్‌తో నెఫ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టు ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇంటర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో అత్యాధునిక సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ఆదిపురుష్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ న‌టించ‌నుండ‌గా, రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నాడు. ఇక సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు. కనీవినీ ఎరుగ‌ని రీతిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తుండ‌గా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఈరోజు నుండి మొద‌లు పెడుతున్న‌ట్టు చిత్ర యూనిట్ పేర్కొంది.

గ్రాఫిక్స్ కోస‌మే దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్ కేటాయించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, అద్భుత మాయాజాలంతో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచేలా నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రావుత్ ప్రకటించగా ఫిబ్ర‌వ‌రి 2న చిత్రాన్ని లాంచ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమార్‌లతో పాటు ఓంరావుత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్ .. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇటీవ‌ల లాంచింగ్ కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో పట్టాలెక్క‌నుంది. ఆదిపురుష్‌తో పాటు స‌లార్ చిత్ర షూటింగ్ కూడా ఏక‌కాలంలో జ‌ర‌గ‌నుంది.