Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతోంది. అయితే సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన మహానాడు వేదికగా మహిళలకు చక్కటి శుభవార్తను తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం స్కీం అమలు తేదీ ఎప్పుడు అన్న విషయాన్ని చెప్పేశారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉచిత బస్సు పథకం హామీ అమలు దిశగా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలించింది.
అయితే ప్రత్యేకంగా మంత్రుల కమిటీని కూడా ఇందుకోసం నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి క్షేత్ర స్థాయిలో అక్కడ పథకం అమలు అవుతున్న విధానం తెలుసుకుంది. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆగస్ట్ 15న మా ఆడబిడ్డలకు శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము. ఎన్నికల ముందు చెప్పాము..సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయాన్ని తిరిగి శ్రమించే వాడికి ఖర్చు పెట్టాలి. మళ్లీ అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఇదొక సైకిల్ కింద ప్రజలను శాశ్వతంగా ఎంపవర్ మెంట్ చేసే కార్యక్రమం అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రభుత్వంపై ఏటా రూ.3,182 కోట్ల మేర భారం పడనుంది. ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్ లో సున్నా ఉంటుంది. కానీ ఈ పోస్ యంత్రంలో మాత్రం టికెట్ ధర నమోదు అవుతుంది. ఇలా మహిళా ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువను ఆర్టీసీ లెక్కించి, ప్రతి నెల ప్రభుత్వానికి అందజేస్తుందట. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుందట.