చార్మి దాదా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఏంటీ కొత్త కథ.!

తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలానికి సంబంధించి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. నాలుగైదేళ్ళుగా నలుగుతున్న వ్యవహారమే. ఎవరు నిందితులు.? ఎవరు దోషులు.? ఎవరు డ్రగ్స్ బానిసలు.? ఎవరు డ్రగ్స్ పెడలర్స్.? అన్నదానిపై వినిపిస్తున్న ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. విచారణ ఏళ్ళ తరబడి సాగుతోంది. విచారణకు హాజరువుతున్న సినీ ప్రముఖులపై మీడియాలో జరుగుతున్న ప్రచారాలతో ఎప్పటికప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కపడుతోంది. తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేసి, పలువురు సినీ ప్రముఖుల్ని విచారిస్తున్న విషయం విదితమే. మొన్న పూరి జగన్నాథ్, నిన్న ఛార్మి, నేడు రకుల్ ప్రీత్ సింగ్.. ఇలా వరుసగా సెలబ్రిటీలు ఈడీ యెదుట విచారణకు క్యూ కడుతున్నారు. కాగా, ఛార్మి విషయమై ‘దాదా’ అన్న పేరు తెరపైకొచ్చింది.

ఆమె ఆ పేరుతోనే ‘వ్యవహారాలు’ నడిపిందంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాకు కోవిడ్ అంటే భయం.. దయచేసి నాకు దారి ఇవ్వండి ప్లీజ్..’ అంటూ మీడియాని వేడుకుంది ఛార్మి, విచారణకు హాజరయ్యే క్రమంలో. మరోపక్క, ఆమె విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చాక, ‘ఈడీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయి, విచారణకు సహకరిస్తాను..’ అని కూడా పేర్కొంది. అసలు ఛార్మి విషయంలో ‘దాదా’ అనే పేరు ఎందుకు తెరపైకొచ్చింది.? ఆమె బ్యాంకు ఖాతా నుంచి డ్రగ్స్ పెడలర్‌గా చెప్పబడుతున్న కెల్విన్ అనే వ్యక్తి ఖాతాకి డబ్బులు వెళ్ళాయనే ప్రచారంలో వస్తవం ఎంత.? ఏమోగానీ, ఛార్మి విషయంలో జరుగుతున్న ఈ ప్రచారమంతా ఇమే ఇమేజ్‌ని డ్యామేజీ చేసేలానే వున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా చిన్న వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి, పలువురు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. పూరి జగన్నాథ్‌తో కలిసి సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టింది. పూరి కనెక్ట్స్ అనే సంస్థని పూరి, ఛార్మి కలిసి నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.