చలసాని శ్రీనివాస్ ఇంట్లో తీవ్ర విషాదం .. కుమార్తె ఆత్మహత్య , కారణం ఏంటంటే ?

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది. సంతానం లేకపోవడం వల్లే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ….

Chalasani Srinivas Daughter Commits Suicide At Hyderabad - Sakshi

చలసాని శ్రీనివాస్ కుమార్తె 27ఏళ్ల శిరిష్మకు హైదరాబాద్ లోని ఓయూ కాలనీలో ట్రయల్ విల్లాస్ లో నివసించే గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో 2016వ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం జరిగింది. సిద్ధార్థ్ గ్రానైట్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటగా, శిరిష్మ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ భార్యాభర్తలు ఇద్దరూ గచ్చీబౌలిలోని ఐకియా స్టోర్ కు దగ్గరలోని ఫ్లాట్ 906 డీ లో నివాసం ఉంటున్నారు.

పెళ్లయి నాలుగేళ్లు అయినా వారికి ఇంకా సంతానం అందలేదు. ఈ విషయమై భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లుగా ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎన్ని మందులు వాడినా, ఎందరు డాక్టర్లను కలిసినా ఫలితం లేకపోవడంతో శిరిష్మ మనస్థాపానికి గురయింది. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. రాత్రి 7.30గంటల సమయంలో వ్యాపార పనులు ముగించుకుని భర్త సిద్ధార్థ్ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో భార్య కోసం వెతకగా గదిలో ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కిందకు దింపి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.