వైరల్ : సీనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ప్రతిష్టాత్మక నిర్ణయం.!

ప్రెజెంట్ నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. అయితే ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య ఒక సంచలన ప్రకటన చెయ్యడం పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది. తన తండ్రి దివంగత స్వర్గీయ నందమూరి తారకరామారావు 100వ జయంతికి గాను ఒక భారీ కార్యక్రమాన్ని బాలయ్య మరియు వారి నందమూరి కుటుంబం చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ డీటెయిల్స్ లోకి వెళితే..

అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి..నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి…మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది..

ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను..మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది… మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు..

అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను..వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నాను.. 365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈమహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.. అని బాలకృష్ణ ఈ అనుకోని డెసిషన్ ని వెల్లడి చేయగా సినీ వర్గాల్లో ఇది వైరల్ గా మారింది.