Crime News: ఆస్తి తగాదాలతో తోడబుట్టిన చెల్లెలి కుటుంబం మీద కత్తులతో దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!

Crime News:ఈ మధ్యకాలంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలకు తావు లేకుండా పోతోంది. మనుషులు బంధాలు బంధుత్వాలు మరిచి డబ్బు చుట్టే తిరుగుతున్నారు. డబ్బు కోసం ఎటువంటి దారుణానికి అయినా వెనుకాడటం లేదు. ఇటీవల ఆస్తి తగాదాల వల్ల సొంత చెల్లెలు కుటుంబం మీద కత్తులతో దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా లో ప్రస్తుతం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే…భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆంగోత్‌ పుత్లీబాయి, ఆమె సోదరుడు భోజ్యాలాల్‌ మధ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చెల్లెలి మీద కక్షతో మంగళవారం పుత్లీభాయి, ఆమె భర్త పెరుమాళ్లు, కుమార్తె సుమిత్రలపై భోజ్యాలాల్‌అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారు. పుత్లీభాయి కుటుంబ సభ్యులు ఎంఎల్‌సీ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రాత్రి వేళలో గ్రామానికి తిరిగి వచ్చారు. వీరి చర్యలను గమనిస్తున్న భోజ్వాలాల్,అతని తమ్ముడు,కొడుకు,కోడలు కలిసి వారి కళ్ళల్లో కారం కొట్టి వారి మీద కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో పుత్లీభాయి , ఆమె భర్త, కూతురు తీవ్రంగా గాయపడ్డారు, కత్తులతో దాడి చేయడం వల్ల వారి పొట్ట భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుత్లీభాయీ భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గురించి భాదితులు జూలూరుపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.