Allu Aravind: వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. కరోనా వల్ల ఎన్నో నష్టాలను, ఇబ్బందులనూ ఎదుర్కొన్న ఈ సినిమా ఫైనల్గా ఇటీవలే షూటింగ్ను పూర్తి చేసుకొని, ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను వైజాగ్లో ఘనంగా నిర్వహించారు . అంతే కాకుండా ఈ ఈవెంట్కు ప్రత్యేక అతిథిగా ప్రముఖ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ పడ్డ శ్రమపై అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే అల్లు అరవింద్ తన కుమారులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఇన్నాళ్లూ తెరవెనుక బాబీ చాలా కష్టపడ్డాడన్న అల్లు అరవింద్, అందరి బలవంతంతోనే ఈ రోజు ఇలా నిర్మాతగా మారాడని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మూవీతో తానేంటో కచ్చితంగా నిరూపించుకుంటాడని, కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లు రామలింగయ్య పాలకొల్లు నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడి సినిమాల్లో రాణించారని ఆయన తెలిపారు. తర్వాత తాను కూడా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, కొంత వరకు సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఇటీవల చేసిన పుష్ప సినిమాతో నేషన్ వైడ్గానే కాకుండా అంతర్జాతీయంగా అల్లు పతాకాన్ని ఎగరేశారని ఆయన కొనియాడారు. అంతే కాకుండా కుమారుల పట్ల తాను గర్వంగా ఉన్నట్టు అల్లు అరవింద్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా గని సినిమా మీద అంచనాలు పెంచేశాయి. మరి గని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.