Crime News: కూకట్ పల్లి విషాదం.. పెంట్ హౌస్ స్లాబ్ విరిగి పడి చిన్నారి మృతి…!

crime News: కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ప్రాణాలు కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కూకట్పల్లిలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.బుల్లి బుల్లి మాటలతో ఇంట్లో సందడి చేసే నాలుగేళ్ల చిన్నారి అనుకోని ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన సునీల్ కుమార్‌, లూత్ మేరీ దంపతులు కొద్ది నెలల క్రితం శాతవాహన నగర్‌కు వచ్చి బేకరి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమారై షారూన్ దీత్య(4) ఉన్నారు. సునీల్ ప్రతిరోజు ఉదయం షాప్ కి వెళ్ళగా ఆయన భార్య రోజు టిఫిన్ తీసుకుని వెళ్ళేది.

రోజులాగే సునీల్‌కు టీఫిన్ బాక్స్ అందించేందుకు మేరీ తన కుమారైతో కలిసి బేకరీ కి వెళ్ళటానికి ఇంటి బయలుదేరింది. బేకరీ వద్దకు రాగానే.. పక్కనే ఉన్న భవనంపై పెంట్‌హోస్‌కు సెంట్రింగ్ కర్రలు తొలగిస్తుండగా స్లాబ్ విరిగి ఒక్కసారిగా స్లాబ్ శిథిలాలు వారిద్దరిపై పడ్డాయి. ఈ ఘటనలో మేరీ స్వల్ప గాయాలతో బయటపడగా.. చిన్నారి దీత్య తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది . ఈ ఘటనలో అదే సమయంలో సైకిల్ పై వెళుతున్న మరొక బాలుడికి కూడా గాయాలయ్యాయి.

ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కన్న కూతురు కళ్ల ఎదుటే మృతి చెందడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభించారు.