
పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి ఓ గేటు వరదల్లో కొట్టకుకుపోయిన మాట వాస్తవం. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరగాలి. కానీ, ఈలోగానే ‘దరిద్ర పాదం ఎఫెక్ట్’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రస్థాయి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ‘జలయజ్ఞం పేరుతో మహా మేత.. దరిద్ర పాదం ఎఫెక్ట్తో ఊడిపడిన గేటు.. సముద్రం పాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు.. తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్’ అంటూ ట్వీటేశారు నారా లోకేష్. వైఎస్ హయాంలో పులిచింతల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. అప్పట్లో ప్రాజెక్టు నాణ్యతపై చాలా విమర్శలూ వచ్చిన మాట వాస్తవం.
అయితే, ఆ సమయంలో ఆ ప్రాజెక్టుని ఏ కాంట్రాక్టు సంస్థ నిర్మించింది.? గేట్లను బిగించిన సంస్థ ఏది.? వంటి అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం వల్లనే నాణ్యత లేని విధంగా గేట్ల రూపకల్పన జరిగిందని వైసీపీ అనుకూల మీడియా విమర్శిస్తోంది. ఆ విమర్శనీ సమర్థించలేం. ఎందుకంటే, ఘటన జరిగింది వైఎస్ జగన్ హయాంలో. ముందుగా డ్యామేజీని సరిదిద్దాలి. ప్రాజెక్టు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పులిచింతల ప్రాజెక్టు.. రాష్ట్రానికి మేలు చేయాలిగానీ, బెజవాడ నగరం నెత్తిన నీటి బాంబులా మారకూడదు. ఈ విషయమై అధికార పార్టీ నుంచి సైతం మాటల స్పందన ఆచి తూచి మాత్రమే రావాల్సి వుంది. ఇక, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు హయాంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం నాణ్యత లేకుండా జరగడం వల్ల కొంత మేర కొట్టుకుపోయిందన్న విమర్శలున్నాయి. అందుకే, నారా లోకేష్ తొందరపడి ట్వీట్లేసెయ్యకూడదు.
