O Thandri Katha Movie: మే 1న ప్రేక్షకుల ముందుకు ‘ఓ తండ్రి కథ’ మూవీ

O Thandri Katha Movie: తండ్రి అంటే నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం… కుటుంబానికి అచంచలమైన ఆధారం… పిల్లల భవిష్యత్తు కోసం తన భావాలను దాచుకుని అహర్నిశలు శ్రమించే త్యాగమూర్తి. అలాంటి తండ్రి గొప్పతనాన్ని హృదయాన్ని తాకేలా ఆవిష్కరించిన భావోద్వేగ చిత్రం ‘ఓ తండ్రి కథ’. కుటుంబ విలువలు, తండ్రి–పిల్లల మధ్య అనుబంధం, బాధ్యతల వెనుక దాగి ఉన్న త్యాగాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, విజయలక్ష్మీ ,తోట సుబ్బారావు, వి. కరుణాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా, LV క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ఆడియో, ప్రచార చిత్రాల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో దర్శకులు వి. సముద్ర, సంజీవ్ కుమార్ మేగోటి ముఖ్య అతిథులుగా పాల్గొని ట్రైలర్, పాటలను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ… “ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్‌లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి గారి నిబద్ధతకు నిదర్శనం” అన్నారు.

దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ… “తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి గారు తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఈ సినిమా పాటలను మా అన్విక ఆడియోస్ ద్వారా విడుదల చేస్తున్నాం. వెంకట్ రెడ్డి గారు కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం” అని అన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ… “బంధాలు, అనుబంధాల విలువను గుర్తు చేసే మంచి కాన్సెప్ట్‌తో సినిమా రూపొందింది. ప్రతి ఒక్కరిని కదిలించే భావోద్వేగ చిత్రం ఇది” అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ… “ఈ సినిమాను ఎంతో మనసుపెట్టి రూపొందించాం. తండ్రి కష్టం, త్యాగం, బాధ్యతలను ప్రతిబింబించే ఈ కథ యువతకు కూడా దగ్గరవుతుంది. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం” అన్నారు.

దర్శకుడు దొరరాజు మాట్లాడుతూ… “టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అనుబంధాల విలువ మారదు. తండ్రి–పిల్లల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు” అని పేర్కొన్నారు.

కళా రాజేష్ మాట్లాడుతూ… “నాన్న గొప్పతనాన్ని మరింత బలంగా చెప్పే చిత్రం ఇది. భావోద్వేగం ఉన్న సినిమా ప్రేక్షకుల హృదయాలను తప్పకుండా గెలుస్తుంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో మోహన్, దొరరాజు, ఘర్షణ శ్రీనివాస్, అడ్వకేట్ లింగంపల్లి శ్రీనివాస్, కళ రాజేష్, వనం చంద్రమౌళి, వినయ రాజ్ తదితరులు పాల్గొని చిత్రాన్ని ఆదరించాలని కోరారు. భావోద్వేగంతో కూడిన కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ‘ఓ తండ్రి కథ’ మే 1న ప్రేక్షకుల మనసులను తాకేందుకు సిద్ధంగా ఉంది.

ప్రధాన నటీనటులు: అశోక్ రెడ్డి లెంకల,విజయలక్ష్మీ , వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా

బ్యానర్: LV క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: అశోక్ రెడ్డి లెంకల
దర్శకుడు: నంది వెంకట్ రెడ్డి
సంగీతం: డ్రమ్స్ రాము
ఎడిటర్ : శ్రీశైలం
DOP : యాదగిరి
స్టంట్స్ : మధు డైమండ్
పీఆర్‌ఓ: అశోక్ దయ్యాల

Kutami Big Offer to Vijayamma? Why Lokesh’s Sudden Wishes? | KS Prasad Analysis | Telugu Rajayam