ఘనంగా జరిగిన”నువ్వే నా ప్రాణం!” మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని డిసెంబర్‌ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

విలేఖరుల సమావేశంలో… చిత్ర నిర్మాత శేషుదేవరావ్‌ మల్లిశెట్టి మాట్లాడుతూ… మొట్ట మొదటిసారి సినిమా రంగంలో అడుగుపెట్టాము. మమ్మల్ని ఆదరించి మా సినిమాను హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను. మా చిత్రంలో సుమన్‌, భానుచందర్‌ లాంటి లెజండ్స్‌ నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించిన వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నారు.

దర్శకుడు శ్రీకృష్ణ మల్లిశెట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక ప్యాషన్‌తో తీయలేదు. ఒక ధ్యేయంతో తీశాము. సినిమా తీయడం వల్ల ఎంతో మంది ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ ను ఎంకరేజ్‌ చేయడంతోపాటు వారికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుందన్న ధ్యేయంతో ఈ ఫీల్డ్‌లో అడుగు పెట్టడం జరిగింది. ఇంట్రస్ట్‌ ఉండి అవకాశం లేక ఇబ్బంది పడుతున్న చాలా మందికి ఒక ప్లాట్‌ఫామ్‌ కావాలనేది మా కోరిక. 2019 లో చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. కోవిడ్‌ రావడంతో కాస్త ఆలస్యం అయింది. 700 చిత్రాలకు పైగా నటించిన సుమన్‌గారు, భానుచందర్‌ గారు ఇందులో నటించడం మా అదృష్ణంగా భావిస్తున్నాము. అలాగే డేట్స్‌ విషయంలోగాని ఎక్కడా కూడా అంత పెద్ద సీనియర్‌ యాక్టర్లు అయినప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ చిత్రంలో ఫైట్స్‌, సాంగ్స్‌ చాలా అద్భుంగా వచ్చాయి. ప్రియాహెగ్డే కూడా చాలా బాగా నటించింది. కన్నడ, తెలుగు చిత్రాల్లో ఇప్పటివరకు ఏడెనిమిది చిత్రాల్లో నటించింది. మా చిత్రంలో నటించాక చాలా అవకాశాలు వచ్చాయి. మ్యూజిక్‌ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. శ్వేతాశర్మ చాలా అద్భుతమైన డ్యాన్స్‌ పర్ఫార్మన్స్‌ ఇచ్చింది. శ్వేత ఢిల్లీలో ఓ మంచి డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్ లో లెక్చరర్‌గా పని చేస్తుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్‌30న విడుదల చేస్తున్నాము అన్నారు.

హీరో కిరణ్‌రాజ్‌ మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఈరోజు నాకు కొంచం బిజీ షెడ్యూల్‌ ఉండడంవల్ల నేను ఈ కార్యక్రమానికి హాజరుకానందువల్ల నన్ను అందరూ క్షమించగలరు. మా చిత్రాన్ని అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోఆర్టిస్ట్‌ హీరోయిన్‌ ఇంకా టెక్నీషియన్స్‌ అందరికీ నా ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

హీరోయిన్‌ ప్రియా హెగ్డే మాట్లాడుతూ… “నువ్వే నా ప్రాణం! ఇది నా డెబ్యూ మూవీ. ఈ చిత్రం వెనుక చాలా ఛాలెంజింగ్స్‌ ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయి ఉన్న సమయంలో కరోనా వచ్చింది. చిత్ర నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి పబ్లిసిటీ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎంతో మంది లెజండరీ నటీనటులతో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్రలో ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. ఫైనల్‌గా ఇదొక కమర్షియల్‌ చిత్రమని చెప్పాలి. నాకు ఇంత మంచి అవకాశాన్నిచ్చిన ఈ చిత్ర దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు అన్నారు.

భానుచందర్‌ మాట్లాడుతూ… సివిల్‌ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్‌ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు ఆయన. సెట్స్‌లో కూడా ఎన్ని పనులు ఉన్నా చాలా బాగా హ్యాపీగా పనిచేసేవారు. ఆయనకు ప్రతీ డిపార్ట్‌మెంట్‌పైన ఎంతో గ్రిప్‌ ఉంది. ఇద్దరు దంపతులు కూడా చాలాబాగా చూసుకున్నారు. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి మూవీని పెద్ద హిట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సుమన్‌ మాట్లాడుతూ… సడెన్‌గా నేను యాక్టర్‌ అయ్యాను. ఇన్నేళ్ళ నా సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించాను. నాకు మొదటిసారి అవకాశాన్ని ఇచ్చిన నా గాడ్‌ ఫాదర్‌ రామన్నగారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే తర్వాత నా గాడ్‌ బ్రదర్‌ భానుచందర్‌ అని చెప్పాలి. ఆయన నాకు తెలుగు రాకపోయినా ఎంతో ఎంకరేజ్‌ చేసి నన్ను కన్నడ చిత్రాల్లోనే కాక తెలుగు సినిమాల్లో నటించేలా చేశారు. ఇకపోతే నేను భానుచందర్‌గారు ఇద్దరం కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్టిస్టులం. అందువల్ల మేమిద్దరం ఎక్కవ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. తమిళ్‌లో ఇద్దరం కలిసి నాలుగైదు చిత్రాల్లో నటించాము. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే స్టోరీ నచ్చి ఓకే చెప్పాను. సెట్‌కి వెళ్ళగానే ఆయన సీన్‌ న్యారేట్‌ చేస్తున్నదాన్ని బట్టి ఎంతో అవగాహన ఉన్న దర్శకుడిలా అనిపించారు. ఎంతో కంపర్టబుల్‌ దర్శకుడు ఆయన. అలాగే ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా చాలా బావున్నాయి. ఫిల్మ్‌ ప్రమోషన్స్‌ కూడా చాలా బాగా చేస్తున్నారు. హీరోహీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు. అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్‌ మాస్టర్‌ – మల్లి, లిరిసిస్ట్‌-వెంకట్‌, సీనియర్ నటుడు తిలక్‌, శ్వేతా శర్మ మ్యూజిక్‌ డైరెక్టర్‌- మణిజెన్నా, పీఆర్‌ఓ- చందురమేష్‌ తదితరులు పాల్గొన్నారు.