యువ రచయిత గణ రచించిన ‘ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది’ అనే తెలుగు నవల అవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, మెహర్ రమేష్, శివ నిర్వాణ, సాయి రాజేష్ లతో పాటు పలువురు రచయితలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా పుస్తకాన్ని అవిష్కరించారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే పుస్తక శీర్షికను ప్రశంసించారు. నవల టైటిల్ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇక రచయిత గణ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి మరోన్నో మంచి నవలలు పాఠకులకు అందించాలని కోరారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ప్రేమకి ప్రాణం ఉంటే – నన్ను చెప్పుతో కొట్టుద్ది నవలను సగం వరకు చదివాను, చాలా ఆసక్తిగా అనిపించింది, మిగితా సగం కూడా త్వరగానే పూర్తి చేస్తాను అన్నారు. ఇది కచ్చితంగా పుస్తక ప్రియులకు ఎంతో చేరువయ్యే నవలా అన్నారు. ఇలాంటి రచనలు నేటి సమాజానికి ఎంతో అవసరం అని కూడా మాట్లాడారు. ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్ తన అనుభూతిని పంచుకుంటూ.. “ఈ పుస్తకంలో ప్రేమ చెప్పుతో కాదు… చెబుతూ కొట్టింది” అంటూ నవలలోని భావాన్ని వినోదాత్మకంగా వివరించారు. ఇది కచ్చితంగా అందరికి నచ్చుతుందని అభిప్రాయ పడ్డారు.
నవల రచయిత గణ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వీరందరి రాకతో నిండుదనం వచ్చిందని, ఈ నవలలో అన్ని రకాల భావోధ్వేగాలు ఉన్నాయన్నారు. యువతకు మాత్రమే కాదు అన్ని వయుసుల వారిని కట్టిపడేసే విషయం ఉన్న ఈ నవల అమెజాన్లో అందుబాటులో ఉందని చెప్పారు. అలాగే గణ రచించిన మరో పుస్తకం ద రియల్ యోగి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేపథ్యంలో రాసిన ఈ ద రియల్ యోగి పుస్తకానికి కూడా చాలా మంచి ఆదరణ వచ్చిందని ఆ పుస్తకం కూడా అమోజాన్ లో అందుబాటులో ఉందని చెప్పారు.