‘సలార్’ చిత్రంలో పాత్రల నడుమ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి – ప్రభాస్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ సినిమాలను రూపొందిస్తూ తనదైన స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న భారీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. ఈ సంస్థ నుంచి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన లేటెస్ట్ భారీ యాక్షన్ అండ్ ఎమోనల్ ఎంటర్‌టైనర్ ‘సలార్ సీజ్ ఫైర్’ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘‘సలార్ చిత్రంలో పాత్రల మధ్య చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో నన్ను చూస్తారు. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అదరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై కలిసి బాగా చర్చించాం. నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టాను. దానికి ఏం చేయాలనే విషయాన్ని ఆయన నాకు వివరించారు. మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనే విషయాన్ని చర్చించాం. నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్‌కి నచ్చాయి. ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం. తను నా పాత్రను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను తను నాకు వివరించేవాడు. ఇద్దరం కలిసి వర్క షాప్స్ చేశాం. సరదాగా సినిమాను పూర్తి చేశాం.

నేను సినీ జర్నీని ప్రారంభించి 21 ఏళ్లు అవుతున్నాయి. తనతో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూశాను. షూటింగ్‌కి వెళ్లాలనే ఆలోచనతో కాకుండా ప్రశాంత్‌తో సమయాన్ని గడపాలని అనుకున్నాను. నా 21 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ భావించలేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైన నెల రోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం.

ప్రశాంత్ హీరోలను గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు. సినిమా షూటింగ్ సమయాన్ని తను రిలాక్స్‌డ్‌గా నా సమయానికి తగ్గట్లు చేసుకుంటూ వచ్చాడు. ఇక నాతో పాటు శ్రుతీ హాసన్, పృథ్వీరాజ్ ఇలా అందరం సెట్స్ లో కలిశామంటే చాలా సరదాగా గడిచిపోయేది. మా ఎంజాయ్‌మెంట్‌కి అడ్డే ఉండేది కాదు. నేను ఎప్పుడూ షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ప్రశాంత్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మేం వెయిట్ చేస్తామని చెప్పినా అతను వినలేదు. ముందుగానే అన్నీ ఏర్పాట్లను చేసుకునేవాడు. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెట్టానో సమయం గుర్తు లేదు. అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి హీరో సన్నివేశాలను చిత్రీకరించటానికి టీమ్ సిద్ధమైంది. తను అంతలా నన్ను కేరింగ్ గా చూసుకున్నారు.

సలార్ సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను మారాను. అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే’’ అని అన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

‘సలార్ సీజ్ ఫైర్’లో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా వ్యవధి 2 గంటల 55 నిమిషాలుగా ఖరారైంది.

డిసెంబ‌ర్ 22న హోంబలే సంస్థ ఇప్పుడు ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.