మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ బయోపిక్

డిసెంబర్ 22: మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దిలీప్ రాజా. గతంలో ప్రముఖ హాస్యనటుడు అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో ‘ చిత్రాన్ని అలాగే అంబేడ్కర్ జీవిత చరిత్రకు దర్శకత్వం వహించారు ప్రస్తుతం ఆయన ” బాబూజీ ” టైటిల్ తో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో బాబూ జగజ్జీవన్ రామ్ బయోపిక్ ను రూపొందిస్తున్నారు.

మాజీ ఐఎయస్ అధికారి డాక్టర్ బి రామాంజనేయులు తొలి క్లాప్ ఇవ్వగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు.జగజ్జీవన్ రామ్ కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తుండగా టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా వివరించారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీజీ అనుచరుడిగా బాబూ జగజ్జీవన్ రామ్ సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటీష్ జైళ్లల్లో గడిపిన రోజుల్లో జరిగిన సంఘటనలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.ఇందులో సుభాష్ చంద్రబోస్,సర్దార్ వల్లభాయ్ పటేల్, మాలవ్య,జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, భగత్ సింగ్, ఇందిరా గాంధీ పాత్రలు కీలకంగా వుంటాయని దర్శకుడు చెప్పారు. రెండవ షెడ్యూలును బీహార్ లోని చాంద్వ గ్రామంలో చిత్రీకించనున్నట్లు తెలిపారు.

జగజ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను కాశ్మీర్ బోర్డర్ లో చిత్రీక రిస్తామని ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి కోరినట్లు చెప్పారు. తాళ్లూరి రామేశ్వరి, మిలటరీ ప్రసాద్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా మైనేని హరి శ్రీనివాస్,ఆపరేటివ్ కెమేరా వంశీ,ఆర్ట్ ఆనంద్ శర్మ,టెక్నికల్ హెడ్ శ్రీధర్, నిర్మాతలు పసుపులేటి నాగేశ్వర రావు, మహమ్మద్ రహంతుల్లా; కథ,మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దిలీప్ రాజా .