‘జయహో రామానుజ’ ఈవెంట్‌లో హీరో సుమన్

సుదర్శనం ప్రొడక్షన్స్ లో జయహో రామానుజ చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణ మోహన్ గారు, f.d.c చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి మాట్లాడుతూ.. ‘నాలానే సాయి వెంకట్ కూడా ఎన్నారై. జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈవెంట్‌కు చిన్నజీయర్ స్వామిని తీసుకురండి. ఆయన ఈ సినిమా గురించి ఇంకా బాగా చెబుతారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సాయి వెంకట్‌కు సినిమా పట్ల అంకిత భావం ఉంది. నిర్మాతగా అతని గురించి తెలుసు. కానీ దర్శకుడిగా, ఆర్టిస్ట్‌గానూ చాలా బాగా చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘రామానుజ చరిత్ర మీద సాయి వెంకట్ సినిమా తీశారు. ప్రపంచవ్యాప్తంగా రామానుజ కథ చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చిత్రాన్ని తీస్తున్న సాయి వెంకట్‌కు సపోర్ట్ చేయడం మా బాధ్యత. ఇలాంటి గొప్ప చిత్రాన్ని తీసిన సాయి వెంకట్‌కు మా కృతజ్ఞతలు’ తెలిపారు.

దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను జనవరిలో ప్రారంభించాను. డిసెంబర్‌లో పూర్తి చేశాను. ఇప్పటికి రెండు పార్టులకు సంబంధించిన కంటెంట్ వచ్చింది. దాదాపు ఐదు గంటల సినిమా వచ్చింది. ఈ సినిమాకు బాహుబలి, బింబిసార రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. చిన్న వాళ్లు సినిమా తీస్తే ఎవ్వరూ అంచనాలు పెట్టుకోరు. మనల్ని మనమే నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. మాలాంటి వారు తీసిన చిన్న సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈ సినిమాను టెక్నికల్‌పరంగా, బిజినెస్ పరంగా తీశాను. రామానుజుల వారి మీద ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. కానీ ఏవీ కూడా థియేటర్ల వరకు రాలేదు. ఎందుకు మధ్యలోనే ఆగిపోయాయ్ రిలీజ్ కాదు. అలా ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసుకున్నాను. కమర్షియల్‌గా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. టెక్నికల్‌గా ఈ సినిమాను అద్భుతంగా తీశాం. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. అశ్వనీదత్‌లా నా కూతుర్లని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చాను. ఈ సినిమాలో నాలుగు పాత్రలను నా కూతురు ఇందులో పోషించింది. సుమన్ గారు ఢిల్లి రాజు పాత్రను పోషించారు. రామానుజుల భార్యగా జో శర్మ చక్కగా నటించారు. సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

సుమన్ మాట్లాడుతూ.. ‘సాయి వెంకట్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి బంధం ఉంది. రామానుజం పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పారు. ఎలా ఉంటుందో అని అనుకున్నాను. అయితే ఫస్ట్ లుక్ చూసిన తరువాత నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. కారెక్టర్‌కి గెటప్ బాగా సూట్ అయితే సినిమా బాగా వస్తుంది. రామానుజం పాత్రకు సాయి వెంకట్ గెటప్ బాగా సెట్ అయింది. నేను వేసిన ఢిల్లీ రాజు కారెక్టర్ చాలా బాగా వచ్చింది. సెట్‌కు వచ్చాకే ఆయన కూతుళ్లను చూశాను. అమ్మాయిలైనా కూడా అబ్బాయిల్లా సెట్‌లో పని చేశారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ పై నుంచి ఆ దేవుడి పర్మిషన్ కావాలి. అన్నమయ్య సమయంలోనూ నా పాత్ర కోసం చాలా మందిని అడిగారు. కానీ ఆ వెంకటేశ్వరుడి స్వామి నన్ను మాత్రం కావాలని అనుకున్నాడు. అందుకే ఆ పాత్ర నాకు వచ్చింది. డబ్బుంటే ఇలాంటి పాత్రలు రావు.. ఆ దేవుడి పర్మిషన్ కావాలి. ఇది కేవలం ఇండియన్ సినిమా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అవుతుంది. సినిమా బాగుంటే.. కంటెంట్ బాగుందంటేనే జనాలు చూస్తున్నారు. ఈ సినిమాను అద్భుతంగా తీశారు. బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

అశ్వాపురం వేణుమాధవ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి చిత్రాన్ని చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇందులో నేను మహారాజు పాత్రను పోషించాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాత సాయి వెంకట్‌ గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఎఫ్‌డీసీ చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్ మాట్లాడుతూ.. ‘నేను బంధువగా కాదు.. బాధ్యతగా ఇక్కడకు వచ్చాను. సుమన్‌ గారిని చూస్తే మా నాన్న గుర్తుకు వస్తారు. నేను మా నాన్నకి చూపించిన ఏకైక చిత్రం 20వ శతాబ్దం. ఇందులో సుమన్ గారు మంచి పాత్రను పోషించారని చెబుతున్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ట్రైలర్‌ను చూస్తే సినిమా మీద ఆసక్తికలిగేలా ఉంది. ఇంత మంచి చిత్రాన్ని తీసిన మీ ప్రయత్నానికి కచ్చితంగా అభినందించాల్సిందే. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ‘సాయి వెంకట్ గారు ఈ సినిమాకు రూపకల్పన చేయడం, సుమన్ వంటి వారు నటించడం విశేషం. సినిమాలు వస్తూ ఉంటాయి. పోతుంటాయి. డబ్బు కోసం, సంపాదన కోసం తాపత్రయపడుతుంటారు. కానీ ఓ సినిమా సన్మార్గమైన బాటను ఇవ్వగలిగితే బాగుంటుందనే సాహసంతో ఈ సినిమాను తీశారు. భగవంతుడ్ని సామాన్యుల వద్దకు తీసుకొచ్చిన గొప్ప వారు రామానుజచార్యుల వారు. అలాంటి గొప్ప వ్యక్తి మీద సినిమాను తీయడానికి ముందుకు వచ్చిన సాయి వెంకట్‌ గారికి మనం అండగా నిలబడాలి. సామాజిక సందేశ చిత్రాలే ఇప్పుడు సమాజానికి అవసరం. ఇలాంటి సినిమా వస్తుండటం నాకు ఆనందంగా ఉంది. సుమన్ లాంటి గొప్ప నటులు ఏ పాత్రైలోనైనా ఒదిగిపోతారు’ అని అన్నారు.

హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన సాయి వెంకట్ గారికి థాంక్స్. దర్శకుడు, నిర్మాత, హీరోగా అద్భుతంగా చేశారు. అమెరికాలోనూ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సింగర్, నిర్మాత సాయి ప్రసన్న మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఒక పాటను నేను పాడాను. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభం కాదు. మా డాడీ ఉండటంతో మాకు ఈ అవకాశం ఈజీగా వచ్చింది. నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన మా నాన్నకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత, డైరెక్టర్, కొరియోగ్రఫర్ ప్రవళిక మాట్లాడుతూ.. ‘రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ సీన్‌ను షూట్ చేశాం. ఉదయం నుంచి రాత్రి వరకు షూట్ చేస్తూనే ఉన్నాం. ఆ అంకిత భావాన్ని చూసి సినిమా యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. మా అమ్మ, సిస్టర్ ఇలా అందరం కలిసి సినిమా కోసం పని చేశాం. నేను ఇందులో మూడు పాత్రలు పోషించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నకు థాంక్స్’ అని అన్నారు.