హైదరాబాద్ చరిత్రను చెప్పేందుకే ‘రజాకార్’ సినిమా తీశారు

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. రానున్న దసరా పండుగ సందర్భంగా ఈ పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మీడియా సమావేశంలో

మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. ‘ఎన్నో కష్టాలు పడి సినిమా తీసిన రజాకార్ టీంకు ఆల్ ది బెస్ట్. దేశమంతా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. మనం కూడా సెలెబ్రేట్ చేసుకుంటాం. కానీ మనకు ఆ రోజు స్వాతంత్ర్యం రాలేదని చాలా మందికి తెలియదు. సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్ర్యం వచ్చిందని చాలా కొద్దిమందికే తెలుసు. కానీ ఆ రోజుని మనం ఇంత వరకు అధికారికంగా జరుపుకోలేకపోవడం మన దురదృష్టకరం. అలాంటి రజాకర్ చరిత్రను చూపించేందుకు సినిమా తీశారు. భారతీ భారతీ ఉయ్యాలో పాటలో చిన్న గ్లింప్స్ చూస్తేనే అందరూ వణికిపోతోన్నారు. సినిమా వస్తే రజాకార్ చరిత్ర అందరికీ తెలుస్తుంది. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్న ఈ టీంకు భగవంతుని ఆశీస్సులు ఉండాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి మాట్లాడుతూ.. ‘రజాకార్ సినిమాలో భారతీ భారతీ ఉయ్యాల పాటకు ఓ నేపథ్యం ఉంటుంది. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి పండుగ జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం రజాకార్లు మన జెండాను ఎగరవేస్తే చంపేస్తారు. ఆ సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ సినిమాకు ఎన్నికల కోడ్‌కు ఎలాంటి సంబంధం లేదు. రజాకార్లను ఉద్దేశించి మాత్రమే ఈ సినిమాను తీశాం. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ల మీద తీయలేదు. ఈ సినిమా మీద ఎవరు ఎక్కడైనా కంప్లైంట్ చేయనివ్వండి. ఎవరికేం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఎన్నో బెదిరింపులు వచ్చాయి. కానీ వాటికి నేను భయపడను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’ అని అన్నారు.

దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. మా పాట, ఆటలో ఆనందం ఉంది, ఆనందంలో ఆవేదన ఉంది.. పండుగలోనే పాట ఉంది.. పాటలోనే కష్టం ఉంది.. అవన్నీ చెప్పే అదృష్టం రజాకార్ చిత్రంతో దొరికింది. రజాకార్ అంటే సేవకుడు అని అర్థం కాదు. కానీ మాకు మాత్రం అరాచకుడు అని తెలుసు. రజాకార్ అంటే సేవకుడు కాదు.. దొంగ నా కొడుకులు అని తెలుసు. వారి చరిత్ర తెరకెక్కించే అదృష్టం నాకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఓ ఐదు శాతమే కాస్త ఫిక్షనల్ ఉంటుందేమో. అది కూడా కథనానికి తగ్గట్టుగా ఉండాలని చేసిందే. నేను, నా టీం అంతా కలిసి 125 పుస్తకాలు రిఫర్ చేశాం. అప్పటి ప్రభుత్వం, ప్రజా కవులు, నిజాం అధికారులు ఇలా అందరూ రాసిన చరిత్ర పుస్తకాలను చదివాను. దాదాపు 125 పుస్తకాలు రాశాను. చరిత్రను వక్రీకరించలేదు. చరిత్రను ఒకే కోణం నుంచి చూపించలేదు. అలా చెప్పాల్సిన పని నాకు లేదు. చరిత్రను చరిత్రలానే చెప్పాను. ఒకే కోణంలో చూడాల్సి వస్తే.. ప్రజా కోణంలోంచి చూశాను. ఆ కోణంలోంచి ఈసినిమాను తీశాను. ప్రజలు పడ్డ బాధల్లోంచి కోణంలో ఈ సినిమాను తీశాను. ఇది మత చరిత్ర కాదు.. గత చరిత్ర’ అని అన్నారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రజాకార్ సినిమాలో నేను సగటు మహిళగా నటించాను. మా డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు.. ఈ చరిత్ర అంతా కూడా మన పుస్తకాల్లో ఎందుకు పెట్టలేదు అని అడిగాను. ఇంటికి వెళ్లి మా అమ్మ, తాత గార్లను అడిగాను. వినోబాబావే గారితో మా తాత గారు కూడా భూదానం చేశారు. ఇది కథ కాదు. జీవితం అని తెలిసిందే. ఇది అవగాహన కల్పించే చిత్రం. ఇది జరిగిన చరిత్ర. నేను ఉన్న ఈ ప్రాంతంలో ఇంత జరిగిందా? అని నాకు తెలియదు. ఇంత జరిగిందా? అని తెలుసుకుని ఈ సినిమాను చేశాను. నిజం చెప్పేందుకే ఈ సినిమాను తీశారు. ఇది కల్పిత కథ కాదు. ఇంత జరిగిందా? అని నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఎంతో సిగ్గు చేటుగా ఉంది. ఇలాంటి ఓ సినిమా వస్తోందని, అందులో ఓ పాటను చేశాను అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అసలు అలాంటి అమానవీయ ఘటనలు జరగకుండా ఉండాల్సింది.కానీ జరిగింది. ఏం జరిగిందో తెలుసుకోవాల్సి బాధ్యత మన మీద ఉంది. నా వంతుగా ఈ సినిమాలో భాగమైనందుకు నాకు ఆనందంగా ఉంది. మన చరిత్రను తెరపైకి తీసుకొస్తున్న దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

అనుష్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘డీకే అరుణ మేడం ఎంతో మందికి స్పూర్తినిచ్చారు. అనసూయ గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. టీజర్ అందరికీ నచ్చింది. మా సినిమాను పెద్ద హిట్ చేయాలి’ అని అన్నారు.