ఇంట్లోకెళ్లి మహిళను ఈడ్చుకొచ్చి… నడి బజార్లో వివస్త్రను చేసి

బిహార్ భోజ్ పూర్ జిల్లాలోని బహియా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడిని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళ పట్ల అటవీకంగా దాడి చేశారు. అంతే కాదు ఆమెను నగ్నంగా ఊరేగించారు. ఇంతకీ వివరాలేంటంటే…

దామోదర్ పూర్ కు చెందిన విమలేష్ షా అనే వ్యక్తి సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. మంగళవారం ఉదయం అతని మృతదేహం రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.

విమలేష్ మృతి చెందిన ప్రాంతానికి దగ్గర్లోనే రెడ్ లైట్ ఏరియా ఉంది. దీంతో ఇతని మృతికి రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కుటుంబమే కారణమని గ్రామస్థులు భావించారు. దీంతో సదరు మహిళను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆమె పై రాక్షసంగా దాడి చేశారు. మహిళ శరీరం మీద దుస్తులను తీసేసి నగ్నంగా ఊరేగించారు. ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక పోయారు. సమాచారం అందుకున్న ఎస్పీ అక్కడకు చేరుకొని గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని అన్నారు. విధుల్లో అలసత్వం వహించిన 8 మంది పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.