ఈసారి ఏకంగా టీడీపీకే  వెన్నుపోటా?

(మల్యాల పళ్లం రాజు*)

 

వెన్నుపోటు రాజకీయాలకు దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ గా పేరొందిన నారా చంద్రబాబు నాయుడు ఈ సారి మరో కుతంత్రానికి తెరలేపారు. 1995 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, తన మామ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవి ఎక్కిన చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో దుష్టశక్తి(లక్ష్మీపార్వతి) నుంచి తెలుగుదేశం పార్టీ రక్షించేందుకు తిరుగుబాటు చేశానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు పార్టీకి తానే దుష్టశక్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కన్పిస్తోంది.  భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు తర్వాత ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు, తనను లక్ష్య పెట్టని ప్రధాని నరేంద్రమోడీని పదవీచ్యుతుడిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యేందుకు సిద్ధపడుతున్నారు.

 

కాంగ్రెస్ దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో  ఆవిర్భవించినదే. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం కాంగ్రెస్ వ్యతిరేకతే. ఆ లక్ష్యంతోనే ఎన్టీ రామారావు  ఒక దశలో దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏక తాటిపైకి తెచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ యేతర ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేశారు.  ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి గద్దె చేజిక్కించుకున్నతర్వాత కూడా చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ పటాన్నే పూజిస్తూ, తాను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్లు ప్రజలను నమ్మించారు. 90వ దశకం చివర్లో అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని  భారతీయజనతా పార్టీతో జతకట్టి, తగిన ప్రయోజనాలనే పొందారు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు అధికారంలోకి దూరమైన తర్వాత మళ్లీ దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం చూసి, ఆ పార్టీతో జతకట్టి  విభజనతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు.

 

భారతీయ జనతా పార్టీతో దాదాపు నాలుగు ఏళ్లపాటు స్నేహమేరా జీవితం.. అంటూ హాయిగా గడిపేశారు. ఎన్డీఏలో చేరి, కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించి, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించి ఆర్డినెన్స్ తీసుకు రావడంతో పాటు, పలు ప్రయోజనాలు పొందారు. అయితే లెక్కలో ఎక్కడో తేడా వచ్చింది. ఫలితంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కేంద్ర మంత్రులను ఉపసంహరించుకున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం కృషిచేసి, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు  యూటర్న్ తీసుకుని మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. కేంద్రం పై పోరాటం పేరుతో ధర్మదీక్షల పేరుతో ప్రజాధనంతో నిరసన దీక్షలు చేపట్టారు. తన హయాంలో ఎన్నడూ ఎవరు దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా, వారి సమస్యలను పరిష్కరించని నారా నాయుడు ఇప్పుడు తన దీక్షలతో కేంద్రం కదలి రావాలని ఆశించారు. ఆ ఆశ నిరాస కావడంతో బీజేపీ వ్యతిరేకత, మోడీ పై ఆగ్రహంతో రగిలి పోయి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.

 

ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు ఏకైక లక్ష్యం తనను నిర్లక్ష్యం చేసిన నరేంద్రమోడీని గద్దె దించడం, భవిష్యత్ లో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి సర్కార్ ఏర్పాటుకు కృషి. ఈ కృషిలో భాగంగానే,  కర్ణాటకలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుమార స్వామి నేతృత్వంలో ఏర్పడిన జేడీఎస్, కాంగ్రెస్ సర్కార్ కు బాహాటంగా మద్దతు ప్రకటించడం.కర్నాటక ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత సోనియాగాంధీతో వేదిక పంచుకోవడంతో టీడీపీ, కాంగ్రెస్ మైత్రీ బంధానికి తెరలేపారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తో ఉమ్మడి కార్యాచరణ సాగించారు. మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీకి దాదాపు దాసోహమన్నారు. అవిశ్వాసం వల్ల కలిగిన ప్రయోజనాలు శూన్యం అయినా,  రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇచ్చి తన విధేయతను చాటు కున్నారు. సోనియా, ఇతర కాంగ్రెస్ నాయకులతో టీడీపీ ఎంపీల భేటీలు, సోనియాను ఎంపీలు కలవడం, తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పారిశ్రామిక వేత్తల భేటీకి నారావారి కోడలు బ్రాహ్మిణి హాజరు కావడం ఉభయ పార్టీల మధ్య పెనవేసుకు పోతున్న మైత్రీ బంధాన్ని చెప్పకనే చెబుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అనుసరించిన ఆకర్ష్ పథకం కారణంగా తెలుగుదేశం పార్టీ దాదాపు మృగ్యమై పోయింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్,  ఎర్రబెల్లి దయాకరరావు నుంచి ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి అంతా టీఆర్ ఎస్ లో చేరిపోయారు. ఇక నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ లో చేరారు.  దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా తయారైంది. టీఆర్ ఎస్ ను ఒంటరిగా ఎదుర్కొనే పరిస్థితి లేనందువల్ల తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండబోదు. అయితే, కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని చంద్రబాబు నమ్ముతున్నట్లు కన్పించడం లేదు. ఆ మిషతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి, తీరా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మాదిరిగానే మోసం చేస్తే, తన రాజకీయ జీవితం ముగిసి పోతుందన్న భయం ఓ కారణంగా కన్పిస్తోంది.

 

బీజేపీని వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ కు జత కట్టేందుకు చంద్రబాబు చేస్తున్న యత్నాలను తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం వ్యతిరేకిస్తున్నా, బాహాటంగా తన నిరసన తెలిపేందుకు సిద్ధంగా లేరు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం అధికారం కోల్పోయే పక్షంలో వారు తమ అసలు రంగు బయట పెట్టి, ప్రత్యర్థి పార్టీకి వత్తాసు పలికినా ఆశ్చర్యం లేదు.

 

బీజేపీతో తెగతెంపులు తర్వాత, నారా చంద్రబాబు నాయుడు ఇక జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుతోపాటు, ఆయన మంత్రులు, ముఖ్యనాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలను దాదాపు మానుకున్నారు. బీజేపీ పైనా, మోడీ పైనా విమర్శలు చేస్తున్నా.. 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూసేందుకే టీడీపీ తన సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మరల్చు కునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు  బెడిసి కొట్టాయి. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లోపించడం, అసెంబ్లీ తీర్మానం కంటి తుడుపు చర్యగా కన్పించడం, కాపు కార్పొరేషన్ విషయంలో చంద్రబాబు వాగ్దాన భంగంతో కాపు కమ్యునిటీ చంద్రబాబును నమ్మడం మానివేయడంతో పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

 

ఇక జగన్ విషయానకి వస్తే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు  అని వైఎస్ ఆర్ సీపీ అధినేత ప్రకటించినందువల్ల, ఎన్నికల తర్వాత మెజారిటీ సాధించిన పార్టీకి , ప్రత్యేక హోదా హామీ పొంది  మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో జతకట్టేందుకు జగన్ ఈ నినాదాన్నే ఆయుధంగా వాడుకోవచ్చు. నిజానికి ఆటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ మోహన్ రెడ్డి లకు  కాంగ్రెస్ మాతృసంస్థ అన్నది నిజం. రాజకీయ నాయకులు సరైన సమయంలో తన నైజాన్ని బయటపెట్టుకుంటారన్నది సహజం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు , మూల సూత్రాలకు వ్యతిరేకంగా చంద్రబాబు  ఏ మేరకు వ్యవహరిస్తారు. కాంగ్రెస్ తో మైత్రి వల్ల ఆయన పొందే ప్రయోజనం కన్నా, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టమే ఎక్కువ అని ఆ పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు.

 

*మల్యాల పళ్లం రాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్