ప్రిన్సిపాల్ మందలించాడని తుపాకీతో బెదిరించి విద్యార్థి..!

తల్లి తండ్రి గురువు దైవంతో సమానమని అంటుంటారు. కనిపించిన తల్లిదండ్రులతోపాటు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కూడా దైవంతో సమానంగా భావించాలి. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల మాత్రమే కాకుండా ఉపాధ్యాయుల పట్ల కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని వారి మీద దాడి చేయడమే కాకుండా పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు మందలిస్తే వారి మీద దాడికి దిగుతున్నారు. ఇటీవల మార్కులు తక్కువ వేశాడన్న కారణంతో ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసిన ఘటన మరవకముందే ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మరొక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ మందలించాడు అన్న కోపంతో ఒక విద్యార్థి ఏకంగా నాటు తుపాకీ తీసుకొని ప్రిన్సిపల్ మీద కాల్పులకు పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే…ఉత్తర్‌ప్రదేశ్‌ లోని సీతాపుర్‌లోని ఆదర్శ్ ఇంటర్ కాలేజీలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కళాశాలలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. విద్యార్థుల గొడవ గురించి ప్రిన్సిపాల్ కి తెలియటంతో ప్రిన్సిపల్ రాం స్వరూప్ వర్మ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇద్దరు విద్యార్థులను మందలించాడు. అయితే వీరిలో ఒకరైన గుర్వీందర్ సింగ్ అనే విద్యార్థి ప్రిన్సిపల్ మందలించటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ మీద కోపంతో రగిలిపోతున్న గుర్వీందర్ సింగ్ ఇటీవల దారుణానికి ఒడికట్టాడు

ప్రిన్సిపల్ మీద కోపంతో రగిలిపోతున్న గుర్వీందర్ సింగ్ శనివారం నాటు తుపాకీ తన వెంట తీసుకొని కళాశాలకు వచ్చాడు. ఈ క్రమంలో కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్‌పై మూడు రౌండ్లపాటు కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు విద్యార్థిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయాడు. కాల్పులు జరపడంతో తీవ్రగాయాల పాలైన ప్రిన్సిపల్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అతనిని లక్నో ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థి పట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.