రాహుల్ గాంధీ స్వయంకృతాపరాధమేగానీ.!

అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడింది.! ఈడీ, సీబీఐ వంటి సంస్థల్ని ఉసిగొల్పింది. న్యాయస్థానాల్ని సైతం ప్రభావితం చేసిందనే విమర్శల్ని ఎదుర్కొంది.! ఇప్పుడేమైంది.? కాంగ్రెస్ నేత, భావి ప్రధాని రాహుల్ గాంధీ, చట్టసభల నుంచి అనర్హుడిగా తేలారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ ఆయన కోల్పోయినట్లే. రాజకీయంగా రాహుల్ గాంధీకి ఇదో పెద్ద షాక్. అసలు ఏనాడూ రాహుల్ గాంధీని సీరియస్ పొలిటీషియన్‌గా కాంగ్రెస్‌లోనే చాలామంది చూడలేదు.

మన్మోహన్ సింగ్ హయాంలో, రాహుల్ గాంధీకి పలుమార్లు ప్రధానిగా అవకాశమొచ్చింది. వృద్ధాప్య సమస్యలతో తాను ప్రధానిగా కొనసాగలేనని ఎన్నిసార్లు మన్మోహన్ చెప్పినా, రాహుల్ సంసిద్ధంగా లేకపోవడంతో, సోనియాగాంధీ ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ మన్మోహన్ సింగ్ అభ్యర్థనను మన్నించి, రాహుల్ గాంధీ గనుక ప్రధాని పీఠమెక్కి వుంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ దుస్థితిలో వుండేది కాదేమో.! ఈ చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. అదీ, మోడీ సర్కారు.. అత్యంత వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని ‘ప్రత్యక్ష రాజకీయాల నుంచి’ తప్పించిన తర్వాత.

ఇక్కడ బీజేపీ సరిదిద్దుకోలేని తప్పు చేసింది.. రాహుల్ గాంధీ విషయంలో. సింపతీ వర్కవుట్ అయి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే, దేశంలో బీజేపీ నామరూపాల్లేకుండా పోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. కాంగ్రెస్ తాను చేసిన తప్పులకు ఇదిగో, ఇలా శిక్ష అనుభవిస్తోంది. బీజేపీ కూడా అంతే.! అదెంతో దూరంలో లేదు.!