లూడో గేమ్ ఆడుతూ పాకిస్థాన్ యువతితో పరిచయం… సీన్ కట్ చేస్తే కటకటాల వెనక్కి..?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు వాడుకం పెరిగిన తర్వాత యువతి యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని ప్రేమలో పడుతున్నారు. ఇలా ఆన్లైన్ ద్వారా ప్రేమించుకున్న ఎంతోమంది యువతి యువకులు నిజజీవితంలో మాత్రం కలిసి జీవించలేకపోతున్నారు. ఇటీవల లూడో ఆడుతూ పాకిస్తాన్ యువతితో పరిచయం పెంచుకొని ప్రేమించిన యువకుడు ప్రియురాలిని పొందటం కోసం దేశాలు దాటి వెళ్లి సాహసం చేశాడు. అయితే ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ప్రేమ జంట పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ములాయంసింగ్ యాదవ్(25) అనే యువకుడు బెంగళూరులో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌కి అలవాటు పడిన యువకుడు గేమ్ ఆడుతున్న సందర్భంలో పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా జీవాని(19) పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా తన ప్రేయసిని తన చెంతకు తీసుకురావాలని భావించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ వేసి దేశాలు దాటి ప్రేయసిని పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా నకిలీ ధృవపత్రాలు సృష్టించి బెంగళూరుకి తీసుకువచ్చాడు. కానీ అతని ప్రేయసి చేసిన పని వల్ల పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఆ యువతి బెంగళూరుకు చేరిన తర్వాత తన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు పసిగట్టి బెంగళూరు పోలీసులకు వెంటనే సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు యువతి యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కి చెందిన యువతని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చినందుకు యువకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇక ఆ అమ్మాయిని ప్రభుత్వ మహిళా వసతి గృహానికి తరలించారు. అయితే ఆ అమ్మాయి నిజంగా యువకుడిని ప్రేమించి తనతో పాటు వచ్చిందా ? లేక పాకిస్తాన్ కి చెందిన గూడచారా? అన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.