కుమార్తె పెళ్లి విందు రద్దు చేసి 11 లక్షలు అమరుల కుటుంబాలకు ఇచ్చిన వ్యాపారి

పుల్వామా ఆత్మాహుతి దాడిలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున మరణించడంతో కలత చెందిన సూరత్‌ వ్యాపారి తన కుమార్తె పెళ్లి విందును రద్దు చేసుకున్నారు. పెళ్లి విందుకోసం ఖర్చు చేయాలనుకున్న రూ.11 లక్షలను పుల్వామా అమరుల కుటుంబాలకు విరాళంగా  ప్రకటించారు.

సూరత్‌కు చెందిన దేవాషి మానెక్ వజ్రాల వ్యాపారి. ఆయన కుమార్తె  అమీ పెళ్లి  శుక్రవారం జరిగింది. వివాహం అనంతరం నిర్వహించాల్సిన పెళ్లి విందును రద్దు చేసిన దేవాషి.. అందుకోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రూ.11 లక్షలను అమరుల కుటుంబాలకు, మరో రూ. 5 లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ప్రకటించారు.

దేవాషి నిర్ణయం విని పెళ్లికి వచ్చిన అతిథులు అభినందించారు. అంతేకాదు, పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా, అట్టహాసం లేకుండా నిర్వహించడంలో అతిథులు సహకారం అందించారు.