ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భారత్ మాస్టర్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్ తన ఆటతీరుతో అభిమానులను మళ్లీ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల శ్రీలంక మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో యువీ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఫీల్డింగ్ తో ఆయన క్రికెట్ దశలో చేసిన అద్భుతాలు గుర్తు చేసుకున్న అభిమానులు, “పాత యువరాజ్ తిరిగి వచ్చాడు” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ప్రత్యేకంగా కనిపించిన మరో విషయం యువరాజ్ కుటుంబం. ఆయన భార్య హేజెల్ కీచ్ తన కుమారుడితో కలిసి స్టేడియంలో సందడి చేసింది. చిన్నారికి సిక్స్, ఫోర్ల గురించి వివరించడమే కాకుండా, తన తండ్రి ఏ విధంగా ఆడుతున్నాడో చూపిస్తూ ఎంజాయ్ చేసింది. ఈ క్యూట్ మూమెంట్స్ ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఫ్యాన్స్ ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. చాలా రోజుల తర్వాత యువరాజ్ కుమారుడిని చూసిన అభిమానులు “జూనియర్ యువీ కూడా క్రికెట్ కి రెడీ అవుతున్నాడా?” అని కామెంట్లు చేస్తున్నారు. “యువరాజ్ లాంటి ఆటగాడు మరోసారి క్రికెట్ మైదానంలో కనిపించడం కన్నా, ఆయన తనయుడు ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయడమే మరింత స్పెషల్” అని నెటిజన్లు చెబుతున్నారు.

