ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాల్లో ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ ఎంటర్టైనర్ ‘కేజీఎఫ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2 రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలో యశ్కు సంబంధించిన మరో పోస్టర్ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు అధీరా లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచినట్లే.. ఈ కొత్త లుక్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ను వచ్చేనెల 8న ఉదయం 10.38కి విడుదల చేస్తామని సినిమా బృందం వెల్లడించింది.
కాగా, ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా మొదటి భాగం చివరలో అధీరా పాత్ర గురించి వివరించి, అధీరా రెండో భాగంలో వస్తాడని సూచించారు. రెండో భాగం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సంజయ్ దత్ కొన్ని రోజులుగా పాల్గొన్నాడు. ఆయన షూటింగ్ ఇటీవలే ముగిసింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హోంబలే ఫిలింస్ ప్రభాస్తో సలార్ సినిమాను నిర్మించనున్నారు.