మెగాస్టార్ కు పద్మవిభూషణ్‌ ప్రకటించే ఛాన్స్‌… సోషల్‌ మీడియాలో వార్తతో అభిమానుల్లో ఆనందం!

మెగాస్టార్‌ చిరంజీవిని మరోసారి పద్మ పురస్కారం వరించనుందన్న ప్రచారం సాగుతోంది. పద్మ అవార్డుల్లో అత్యున్నత పురస్కారంతో ఆయన్ను సత్కరించాలని భారత ప్రభుత్వం సిద్ధం అయినట్లు సమాచారం. చిరంజీవిని 2006లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవలకు గాను, సినిమాలతో ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తున్న అందుకు గాను పద్మ పురస్కారంతో గౌరవించింది.

ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే… అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ప్రతి ఏడాది రిపబ్లిక్‌ డేకి ముందు రోజు పద్మ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది ప్రకటించబోయే పేర్లలో చిరంజీవి పేరు ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించింది. అన్ని రంగాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు చిత్రసీమ ఏమీ అతీతం కాదు. ఆ కష్ట కాలంలో చిరంజీవి ముందడుగు వేశారు. ఇండస్టీ ప్రముఖులను ఏకం చేసి పెద్దన్న పాత్ర పోషించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు, విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు.

వ్యక్తిగతంగా కొంత మందికి ఆయన సాయం చేశారు. సకాలంలో ఆక్సిజన్‌ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు అంబులెన్స్‌ సర్వీసులు నడిపారు. ఈ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు తెలిసింది.

సోషల్‌ మీడియాలో ప్రచారం మెగా అభిమానులకు అమితానందం కలిగిస్తోంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తరానికి చెందిన హీరోలు రెండు, మూడు వందల సినిమాలు చేశారు. అయితే… ప్రస్తుతం, ఈ తరంలో తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన అగ్ర హీరో చిరంజీవి అని చెప్పాలి. హీరోగా 150కు పైగా సినిమాలు చేశారు.