Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక ఓ బలమైన కారణం.. ఏం జరిగింది?

టీమిండియా ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో కీలక టెస్ట్ సిరీస్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. అనుభవం గల ఆటగాడిగా, కెప్టెన్‌గా బలమైన గుర్తింపు ఉన్న రోహిత్ ఇలా అకస్మాత్తుగా తప్పుకోవడం వెనక ఎందుకన్న ప్రశ్నలే ఎక్కువయ్యాయి.

తాజాగా స్కై స్పోర్ట్స్ అనే క్రీడా వెబ్‌సైట్ ఒక కీలక విషయం వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం, రోహిత్‌ బీసీసీఐ సెలక్షన్ కమిటీకి – “ఇంగ్లండ్ సిరీస్‌కు టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తే, సిరీస్ ముగిసేలోగా రిటైర్మెంట్ ప్రకటిస్తాను” అని ముందుగానే తెలిపాడట. అయితే సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే తీసుకోవాలని నిర్ణయించిందట. ఈ వ్యవహారంతో రోహిత్ తాను ఆలోచించిన మార్గంలో వెళ్లకుండా, అసహనంతో టెస్ట్ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

రోహిత్ టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి, 12 సెంచరీలతో 4,301 పరుగులు సాధించాడు. 2019లో దక్షిణాఫ్రికాపై 212 పరుగులతో అతని అత్యుత్తమ స్కోరు నమోదైంది. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించిన రోహిత్ 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు సాధించాడు. భారత్‌కు ఓ సాఫ్ట్-స్టైల్ కెప్టెన్సీ ఇచ్చిన అతని బాధ్యతాయుతమైన ఆటతీరు అభిమానులను మెప్పించింది.

ఇప్పుడు ఈ వార్తల నేపథ్యంలో, రోహిత్ కెరీర్ ముగింపు బీసీసీఐ వ్యూహంలో భాగమేనా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆటగాడిగా ఆయన సేవలు అందించే అవకాశం ఉన్నా, కెప్టెన్‌గా తిరిగి వస్తాడా? లేదా టెస్ట్ క్రికెట్‌తోపాటు రానున్న మరో ఫార్మాట్లకు కూడా వీడ్కోలు పలికేనా? అన్నది ఆసక్తిగా మారింది.