ఐపీఎల్ 2025 సీజన్లో ఆదివారం రాత్రి జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ అందర్నీ ఉత్కంఠకు గురిచేసింది. కోల్కతా నైట్రైడర్స్ (KKR) తమ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంటూ రాజస్థాన్ రాయల్స్ (RR)పై చివరి బంతి వరకు సాగిన పోరులో కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్, 25 బంతుల్లో 4×4, 6×6) విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. అతనికి తోడు రఘువంశీ (44), గుర్బాజ్ (35), రింకూ సింగ్ (19 నాటౌట్)లు మద్దతిచ్చారు. రాజస్థాన్ బౌలింగ్లో ఆర్చర్, పరాగ్, యధ్వీర్, తీక్షణ తలో వికెట్ తీశారు.
తర్వాత ఛేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడినా 205/6కే పరిమితమైంది. రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 (6×4, 8×6)తో టాప్ స్కోరు చేయగా, జైస్వాల్ 34, హెట్మైర్ 29, శుభమ్ దూబే 25 బాగానే రాణించారు. చివరి ఓవర్లో 22 పరుగులు కావాల్సిన సందర్భంలో దూబే మూడు బంతుల్లోనే 16 రన్స్ కొట్టి మ్యాచ్ను థ్రిల్లింగ్కు తీసుకెళ్లాడు. కానీ ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమైన దశలో ఆర్చర్ రనౌట్ కావడంతో కేకేఆర్ విజయం సాధించింది.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ చెరో 2 వికెట్లు తీసారు. హర్షిత్ కీలక సమయంలో పరాగ్ను ఔట్ చేసి మ్యాచ్కు మలుపు తిప్పిన విధానం అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజయం తర్వాత కేకేఆర్ ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్తుండగా, రాజస్థాన్ లీగ్ నుంచి అవుట్ అయినట్లే. ఇంకా మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిచినా పెద్దగా ఉపయోగం లేనట్లే.