భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని గతంలో చాలా సార్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఆయన ముఖ్యమైన పార్టీ నుంచి పోటీ చేస్తారని, కీలక పదవులు చేపడతారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ దాదా అలాంటి వార్తలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు పరోక్షంగా చెప్పేశారు.
తాజాగా పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామక వివాదంలో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు గంగూలీని కలిశారు. తమ సమస్యపై జరిపే నిరసనకు మద్దతు ఇవ్వాలని ఆయన్ని కోరారు. కానీ దాదా ఈ అంశానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. “దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. నాకు ఈ వివాదంతో సంబంధం లేదు,” అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఈ తాజా ఘటనతో గంగూలీ మరింత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ వార్తలకు ఎప్పుడూ దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు ఇంకాస్త స్పష్టంగా తన వైఖరిని తెలియజేశారు. ఈ మాటలతో భవిష్యత్లో కూడా రాజకీయాల జోలికి వెళ్లే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పకనే చెప్పారనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం సౌరవ్ గంగూలీ క్రికెట్ పరిపాలనతో పాటు వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఇకపై తనపై రాజకీయాలకు సంబంధించిన వార్తలు రావడం తగ్గే అవకాశం ఉంది. తన ఫోకస్ అంతా క్రికెట్, వ్యాపారాలపైనే ఉంటుందని ఆయన తన తాజా క్లారిటీతో స్పష్టంచేశారు. ఇక అభిమానులకు కూడా దాదా రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు దాదాపు తొలగిపోయినట్టే అనిపిస్తోంది.